ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం రాష్ట్రపతి పాలన అస్త్రం!
సోనియాగాంధీకి ఆంధ్ర మీద ప్రేమ లేదు, తెలంగాణ మీద వాత్సల్యం లేదు. ఆమెకు, ఆమె చుట్టూ ఉన్న అనుచర గణానికి తెలుగు ఓటర్ల అభిమానం కావాలి. రాష్ట్రం రెండుగా విడిపోయినా రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్న నమ్మకం కలిగిన తర్వాతే మరో నిర్ణయం తీసుకునే అవకాశముంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే, టిఆర్ ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానన్న సంకేతాన్ని కెసిఆర్ కేంద్రానికి పంపించారు. అయినా దీని మీద తర్జన భర్జనలు ఇంకా జరుగుతున్నాయి.
ఇప్పుడు తెలంగాణ వాదుల చూపు కేంద్ర కేబినెట్ మంత్రి జైపాల్ రెడ్డి మీద ఉంది. కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణకు అనుకూలంగా 9న తొలి ప్రకటన చేసినప్పుడు జైపాల్ చాలా ఆనందం వ్యక్తం చేశారు. తన మనసులో ఉన్నా ఎప్పుడూ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడని జైపాల్ ఇలా బయటపడి ఇరుక్కున్నారు. ఇప్పుడు తెలంగాణ వాదులు జైపాల్ మీద విచిత్రమైన వత్తిడి తెస్తున్నారు. కేంద్ర కేబినెట్ లోనే ఉండి తెలంగాణ కోసం ఆయన సమరం చేయాలన్నది వారి ఉద్దేశం.
రాష్ట్రపతి పాలన విధిస్తే గవర్నర్ కు, ఆయన సలహాదారులకు, చీఫ్ సెక్రటరీకి పూర్తి అధికారాలు సంక్రమిస్తాయి. ఆరునెలల పాటు అసెంబ్లీని సస్పెండెడ్ యానిమేషన్ లో ఉంచవచ్చు. ఈలోపు పరిస్ధితులు శాంతిస్తే తెలంగాణకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశముంది.