రైతులు ఈ పంటలు సాగుచేస్తే రైతుభరోసాతో పాటు రూ.8వేల అదనపు ఆదాయం!
తెలంగాణలో రైతులకు శుభవార్త. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసి, రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కొత్త సమగ్ర వ్యవసాయ విధానం-2026 నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఈ నివేదికలో వరి సాగును తగ్గించి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని సూచించారు. దీని కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చే రైతులకు ఎకరానికి రూ.4,000 నుంచి రూ.8,000 వరకు అదనపు నగదు సాయం అందించాలని ప్రతిపాదించారు.
మంత్రిమండలి సమావేశంలో ఈ నివేదికపై చర్చ
జులై 2న జరగబోయే మంత్రిమండలి సమావేశంలో ఈ నివేదికపై చర్చించనున్నారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగినప్పటికీ, ఒకే పంటపై అధికంగా ఆధారపడటం వల్ల నీటి వనరులు, భూమి నాణ్యతపై ఒత్తిడి పెరుగుతోంది. మిగులు ధాన్యం నిల్వలు, నిర్వహణ ఖర్చులు, సహజ వనరుల సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య నేతృత్వంలోని బృందం జాతీయ, అంతర్జాతీయ అనుభవాలను పరిశీలించి సమగ్ర నివేదిక సిద్ధం చేసింది.

ప్రత్యామ్నాయ పంటలసాగు చేస్తే అదనంగా 8 వేలు
నివేదిక ప్రకారం రాబోయే ఐదేళ్లలో 25లక్షల ఎకరాల వరి సాగును దశలవారీగా తగ్గించి ప్రత్యామ్నాయ పంటలకు మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పత్తి, పెసర, వేరుసెనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు సాగు చేసే రైతులకు రైతు భరోసా సాయంతో పాటు ఎకరాకు రూ.8,000 అదనపు ఇన్సెంటివ్ ఇవ్వాలని సూచించారు. జొన్న సాగుకు రూ.5,000, మొక్కజొన్న, కంది, మినుము, ఆముదం, సోయాబీన్, శనగ వంటి పంటలకు ఎకరాకు రూ.4,000 చొప్పున సాయం అందించాలని ప్రతిపాదించారు.
వ్యవసాయమే కాదు వీటిని ప్రోత్సహించాలని నిర్ణయం
పంట మార్పిడి మాత్రమే కాకుండా, ఉత్పత్తులకు మంచి మార్కెట్ అవకాశాలు కల్పించాలని నివేదికలో ఉన్నది. పప్పుధాన్యాల మిల్లులు, నూనె గింజల శుద్ధి కేంద్రాలు, నిల్వ సౌకర్యాలు, ప్యాకేజింగ్, బ్రాండింగ్ వంటి వాల్యూ ఎడిషన్ యూనిట్లను ప్రోత్సహించాలి. మహిళా స్వయం సహాయక సంఘాలు, ప్రైవేటు సంస్థలను ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలని సూచించారు.
ప్రత్యేక పంట బీమా పథకం అమలుకు ప్లాన్
రైతుల్లో నష్టాల భయాన్ని తొలగించడానికి ప్రభుత్వమే నిధులు సమకూర్చి ప్రత్యేక పంట బీమా పథకం అమలు చేయాలని నివేదికలో పేర్కొన్నారు. ఇది రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపడానికి ఉపయోగపడుతుంది. ఈ కొత్త విధానం అమలైతే రైతుల ఆదాయం పెరిగి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వం ఈ సూచనలను అమలు చేస్తే తెలంగాణ వ్యవసాయ రంగం దిశ మార్చుకుంటుందని రైతు సంఘాలు భావిస్తున్నాయి.












Click it and Unblock the Notifications