JoSAA 2026: జోసా కౌన్సెలింగ్ లో టాప్ బ్రాంచ్, టాపర్ల ఛాయిస్ ఐఐటీలివే..!
ఈ ఏడాది జేఈఈ అడ్వాన్సెడ్ లో ఉత్తీర్ణులైన అభ్యర్ధులకు నిర్వహిస్తున్న జోసా 2026 (JoSAA 2026 ) కౌన్సెలింగ్ లో ఈసారి కూడా సీఎస్ఈ బ్రాంచ్ కు టాప్ డిమాండ్ ఉంది. అలాగే సీఎస్ఈ బ్రాంచ్ కోరుకుంటున్న టాప్ ర్యాంకర్లు దేశంలో ప్రస్తుతం ఉన్న టాప్ ఐఐటీల్లో సీట్ల కోసం ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు జేఈఈ అడ్వాన్సెడ్ ర్యాంకర్ల సీఎస్ఈ బ్రాంచ్ టాప్ ఛాయిస్ ఐఐటీలు ఏంటో ఓసారి చూద్దాం..
జేఈఈ అడ్వాన్స్డ్ అర్హత సాధించిన విద్యార్థులలో 'కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్' (CSE) కోర్సును ఐఐటీల్లో టాప్ ఛాయిస్ గా ఎంచుకుంటున్నారు. ఇందులోనూ సీఎస్ఈ బ్రాంచ్ కు ఐఐటీ బోంబే టాప్ ఛాయిస్ గా నిలిచింది. జోసా విడుదల చేసిన మొదటి విడత ప్రారంభ, ముగింపు ర్యాంకుల ప్రకారం, ఐఐటీ బాంబేలోని సీఎస్ఈ ప్రోగ్రామ్ 'జెండర్-న్యూట్రల్' (అందరికీ వర్తించే) విభాగంలో AIR 1 వద్ద ప్రారంభమై AIR 65 వద్ద ముగిసింది. దీన్ని బట్టి చూస్తే ఇది టాప్ ఐఐటీలో టాప్ కోర్సుగా నిలిచింది.

అలాగే జోసా కౌన్సెలింగ్ లో కేవలం మహిళలకు కేటాయించిన సీట్ల విషయానికొస్తే, అడ్మిషన్లు AIR 77 వద్ద ప్రారంభమై AIR 395 వద్ద ముగిశాయి. మొత్తం ఐఐటీ వ్యవస్థలోనే ఇది అత్యంత తక్కువ పరిధి, అత్యధిక పోటీ ఉన్న విభాగంగా ఉంది. మొదటి విడత జోసా కౌన్సెలింగ్ గణాంకాలు చూస్తుంటే సీఎస్ఈ ప్రవేశాలలో పాత ఐఐటీల ఆధిపత్యం కొనసాగుతోందని స్పష్టమవుతోంది. ఐఐటీ బాంబే తర్వాత, ఐఐటీ కాన్పూర్ సీఎస్ఈ ప్రోగ్రామ్ AIR 32 వద్ద, ఐఐటీ ఢిల్లీ ప్రోగ్రామ్ AIR 35 వద్ద ప్రారంభమయ్యాయి.

దేశంలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన అభ్యర్థులు పాత ఐఐటీలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనడానికి ఇది నిదర్శనం. ఐఐటీ ఢిల్లీలో జెండర్-న్యూట్రల్ సీట్ల ప్రక్రియ AIR 123 వద్ద ముగియగా, ఆ తర్వాతి స్థానాల్లో ఐఐటీ మద్రాస్ (AIR 67 వద్ద ప్రారంభం - 149 వద్ద ముగింపు), ఐఐటీ కాన్పూర్ (32-276), ఐఐటీ ఖరగ్పూర్ (217-509) ఐఐఠీ రూర్కీ (277-582) నిలిచాయి. కొత్త తరం IITలలో ఐఐటీ హైదరాబాద్ సీఎస్ఈ ప్రోగ్రామ్ AIR 339 నుండి 647 మధ్య ర్యాంకుల్లో నడిచింది. కేవలం ఏడు ఐఐటీలలో మాత్రమే 'జెండర్-న్యూట్రల్' (లింగ-తటస్థ) సీఎస్ఈ సీట్ల భర్తీ ప్రక్రియ మొదటి 700 ర్యాంకుల పరిధిలోనే ముగిసింది . అవి ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ మద్రాస్, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ ఖరగ్పూర్, ఐఐటీ రూర్కీ, ఐఐటీ హైదరాబాద్.














Click it and Unblock the Notifications