ఆ కులం ఓట్లు పోయాయా?
రాష్ట్ర కాపునాడు చైర్మన్ మిరియాల వెంకట్రావు, కన్వీనర్ డా ఎస్.వెంకటేశ్వరరావు పేరుతో ఈ కలర్ యాడ్ విడుదలైంది. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి నిన్న జిల్లా, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల సమావేశంలో ప్రసంగిస్తూ "ఆ కులం" ఓట్లు చిరంజీవి ప్రజారాజ్యంకు పడ్డాయని, ఇంకా ఎక్కువ అసెంబ్లీ స్ధానాలు రాకపోవడానికి అదొక కారణమని చెప్పారు. ఈ నేపధ్యంలో అసలు కాపు ఓట్లు ఏ విధంగా చీలిపోయాయన్నది చర్చనీయాంశమైంది. కాపు ప్రధాన సంఘం కాంగ్రెస్ లో ఉంది కానీ ప్రజారాజ్యం వైపు లేదన్న సత్యం ఈనాటి ప్రకటనతో విదితమైంది.
రంగా హత్య తర్వాత కాపులు తెలుగుదేశం పార్టీకి బద్ధ వ్యతిరేకులైన విషయం తెలిసిందే. రంగాతో మంచి సంబంధాలు గల రాజశేఖరరెడ్డి అంటే కోస్తా కాపులకు ప్రత్యేక అభ్హిమానం ఉంది. కాంగ్రెస్ కు వైఎస్ నాయకుడు కాబట్టే కాపులు కాంగ్రెస్ కు ఓటు వేస్తూ వస్తున్నారు. మరో నాయకుడు ఉంటే కాపు ఓటు బ్యాంకు మరో విధంగా చీలిపోయి ఉండేది. చిరంజీవి పార్టీకి వచ్చిన ఆ 17 శాతం ఓట్లలో అన్నివర్గాల్లో ఉన్న ఆయన అభిమానుల ఓట్లు పది శాతం వరకు ఉండవచ్చని, ఏడు శాతం కాపు కులం ఓట్లు పడ్డాయని ఒక అంచనా. ఆ ఏడు శాతం ఓట్లు కాంగ్రెస్ కు పడాల్సినవని, చిరంజీవి వల్ల అటు వెళ్ళి పోయాయని రాజశేఖరరెడ్డి ఆవేదన. వచ్చే ఎన్నికల్లో 230 నుంచి 240 స్ధానాలు గెలుచుకోవాలని ఆయన పార్టీ నాయకులకు మార్గ నిర్దేశం చేశారు. అంటే వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలను పూర్తిగా బొందబెట్టాలని ఆయన నిర్ణయించుకున్నట్టు కన్పిస్తోంది.
ప్రజాకర్షక విధానాల వల్ల రాష్ట్ర బడ్జెట్ చిక్కి శల్యమైన పరిస్ధితిలో రాజశేఖరరెడ్డి ఆదాయ మార్గాల మీద, పరిపాలనా సంస్కరణల మీద దృష్టి పెట్టాలి. కానీ ఆయన ఇంకా రాజకీయాల హ్యాంగోవర్ లో ఉండిపోయారు.