విజయశాంతి నిర్ణయం వెనుక?
తెలంగాణ రాష్ట్రానికీ మద్దతు ఇచ్చే పార్టీలతో కలిసి పనిచేస్తానని విజయశాంతి చెబుతూ వచ్చారు. అందుకు అనుగుణంగానే ఆమె టీఅర్ ఎస్ లో విలీనమై, మహా కూటమిలో సభ్యురాలు కానున్నారు. విజయశాంతి టీఅర్ ఎస్ తరఫున ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమెను మహా కూటమి వైపునకు ఒడుకుగా నడిపించుకువచ్చినది బాలకృష్ణేనని తెలుస్తోంది. బాలకృష్ణ-విజయశాంతి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ లు వచ్చాయి. అహంభావం ప్రదర్శించని వ్యక్తి బాలకృష్ణ అని అనేక సందర్భాల్లో విజయశాంతి ఆయన మీద ప్రశంసల జల్లులు కురిపించింది. దీనికితోడు విజయశాంతి భర్త అయిన ప్రసాద్ చంద్రబాబు నాయుడికి సన్నిహితుడని చెబుతున్నారు.
ఒక దశలో తెలుగుదేశం పార్టీలో చేరడమే ఉత్తమమని భావించిన విజయశాంతి ఆ తర్వాత విరమించుకున్నారు. నాలుగేళ్ళ పాటు తెలంగాణ జెండా పట్టుకుని తిరిగి సడన్ తెలుగుదేశం పార్టీలో చేరితే ఆక్షేపణలు వస్తాయని ఆమె భయపడ్డారు. టీఅర్ ఎస్ లో కలిసినా ఎటూ తెలుగుదేశం మహా కూటమిలోనే ఉంటాం కదా అన్న ఉద్దేశంతో ఆమె టిఆర్ ఎస్ లో విలీనం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
గతంలో బిజెపి జాతీయ మహిళా మోర్చాలో పని చేసిన విజయశాంతికి ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక ఫేవర్లు లభించినట్టు ఆరోపణలు ఉన్నాయి. బిజెపి కేంద్రంలో అధికారంలో ఉన్నడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండే వారు. రాష్ట్రంలో కూడా అమెకు అనేక వరాలు లభించినట్టు తెలుస్తోంది.