క్లీన్ ఇమేజ్ కోసం పాట్లు
గత ఐదేళ్ళలో ఆయన ఈ విషయాల మీద పెద్దగా దృష్టి సారించలేదు. ఖజానా ఖాళీగా ఉండడం, నీటిపారుదల ప్రాజెక్టులను అనుకున్నంత త్వరగా పూర్తి చేస్తామన్న నమ్మకం స్నగిల్లడం వల్లనే వైఎస్ బైపాస్ రోడ్డులోకి వెళ్ళి "క్లీన్ ఇమేజ్" కోసం ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. గత ఐదేళ్లుగా అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తూనే వాటిలో అవినీతిని రూపుమాపాలని ఆయన కృత నిశ్చయంతో ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా ప్రక్షాళించాలన్న ఉద్దేశంతో భారీ ఎత్తున ఐఎఎస్ అధికారుల బదిలీలు సాగుతున్నాయి. డీపెప్ వంటి కుంభకోణాలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
గడిచిన ఐదేళ్ళలో వైఎస్ ప్రభుత్వంపై అవినీతి ముద్ర బలంగా పడింది. అనేక కుంభకోణాలు బయటపడ్డాయి. సెజ్ ల పేరిట ప్రైవేటు సంస్ధలకు వేలాది ఎకరాలు తక్కువ ధరలకు కేటాయించడం విమర్శలకు తావిచ్చింది. ఈ విధంగా ప్రభుత్వం ద్వారా లాభపడిన వారు జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టడం చర్చనీయాశమైంది. ప్రతిపక్షాలకు ఇవన్నీ విమర్శనాస్త్రాలుగా పనికొచ్చాయి. అయితే ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్ళడంతో అవినీతి పెద్ద అంశం కాలేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చింది.
ఈసారి మాత్రం క్లీన్ ఇమేజ్ తెచ్చుకోవడానికి వైఎస్ ప్రయత్నిస్తున్నారు. నీటిపారుదల ప్రాజెక్టులకు నిధుల కొరత ఏర్పడడంతో కిక్ బ్యాక్స్ కు కూడా పెద్దగా అవకాశం లేకుండా పోయింది. కాంట్రాక్టర్లకు అడ్వాన్సు చెల్లింపులు ఇప్పట్లో లేనట్టే. విమర్శలకు తావు లేకుండా పరిపాలన సాగించి, చరితార్ధుడవ్వాలని వైఎస్ ఆకాంక్ష. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రిటైరై, తన స్ధానంలో తనయుడు జగన్ ను నిలబెట్టాలన్నది కూడా ఆయన స్కీములో భాగమని చెబుతున్నారు.