వైయస్ జగన్ కు కిరణ్ కౌంటర్

తాజాగా వైయస్ జగన్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్న శాసనసభ్యులు పేర్ని నాని, శేషారెడ్డిలతో ఆయన వ్యక్తిగతంగా మాట్లాడారు. వీరిలో పేర్ని నాని మనుసును ఆయన పూర్తిగా మార్చినట్లే కనిపిస్తున్నారు. శేషా రెడ్డి మెట్టు దిగినట్లు అనిపిస్తోంది. ఇలా మాట్లాడడం ద్వారా కనీసం శాసనసభ్యులను పునరాలోచనలో పడేయడానికి వీలవుతుందనేది కిరణ్ కుమార్ రెడ్డి ఉద్దేశంగా చెబుతున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కె. రోశయ్య ఈ పని చేయలేకపోయారు. వయస్సు సహకరించకపోవడం వల్లనో, వ్యూహరచన కొరవడడం వల్లనో రోశయ్య ఆ పని చేయలేకపోయారు. ఒక రకంగా పార్టీ అధిష్టానం అప్పగించిన పనిని కిరణ్ కుమార్ రెడ్డి నెరవేర్చేందుకు పూనుకున్నారని చెప్పవచ్చు. వైయస్ జగన్ కదలికలను ఎప్పటికప్పుడు కనిపెడుతూ తగిన కౌంటర్ వ్యూహాన్ని కిరణ్ కమార్ రెడ్డి సిద్ధం చేస్తున్నట్లే కనిపిస్తున్నారు. వైయస్ జగన్ ను శాయశక్తులా ఎదుర్కునేందుకు సిద్ధపడ్డారని తెలుస్తోంది.
కాగా, రైతు సమస్యలపై ఈ నెల 21, 22 తేదీల్లో 48 గంటల పాటు వైయస్ జగన్ విజయవాడలో తలపెట్టిన నిరాహార దీక్షను విఫలం చేయడానికి కూడా కిరణ్ కుమార్ రెడ్డి అప్పడే పావులు కదుపుతున్నట్లు సూచనలు కనిపిస్తున్నాయి. దీనిపై విజయవాడకు చెందిన కాంగ్రెసు నాయకుడు దేవినేని నెహ్రూ అప్పుడే కార్యాచరణకు దిగారు. కిరణ్ కుమార్ రెడ్డి సూచన మేరకు ఆయన రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. తన నివాసంలో ఆయన మధ్యాహ్నం విందు సమావేశం ఏర్పాటు చేసి కృష్ణా జిల్లాకు చెందిన ముఖ్య నాయకులను పిలిచారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్, పిన్నమనేని, ఉదయభాను పాల్గొన్నారు. కృష్ణా జిల్లా నుంచి వైయస్ జగన్ వైపు కాంగ్రెసు నాయకులు పెద్ద యెత్తున వెళ్తున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో దానికి కళ్లెం వేయడానికి వీరు రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద, వైయస్ జగన్ కు దీటైన వ్యూహరచనతోనే కిరణ్ కుమార్ రంగంలోకి దిగుతున్నట్లు చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications