హైకమాండ్ కు జగన్ కౌంటర్

కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ బహిరంగంగా హెచ్చరిక చేసినప్పటికీ పట్టించుకోవాల్సిన అవసరం లేదనే విధంగా ఆయన వ్యవహరిస్తున్నారు. స్వయంగా సోనియా గాంధీ చెప్తే గాని దానికి అధికారిక ప్రతిపత్తి రాదనే ఉద్దేశాన్ని కల్పిస్తున్నారు. ఓదార్పు విషయంలో సోనియా సూచనలను తాను పాటించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అదే సమయంలో జిల్లాల్లోని శాసనసభ్యులకు బలమైన సంకేతాలను అందిస్తున్నారు. నిజానికి, ఈ నెలలోనే ప్రకాశం జిల్లాలో ఆయన ఓదార్పు యాత్ర నిర్వహించాల్సి ఉంది. కానీ, దాన్ని వచ్చే నెలకు వాయిదా వేసుకున్నారు. ఈలోగా తన సొంత జిల్లా కడపలో రెండు రోజుల పాటు ఓదార్పు యాత్ర నిర్వహించారు. ఈ ఓదార్పు యాత్రలో అధిష్టానం ఆదేశాలను ధిక్కరించి ఆరుగురు శాసనసభ్యులు పాల్గొన్నారు. దానికి తోడు, రాయచోటి శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. వీరందరిపై అధిష్టానం చర్య తీసుకుంటుందా అనేది అనుమానమే. వారిపై చర్యలు తీసుకోకపోతే మిగతా జిల్లాల్లోని శాసనసభ్యులకు నమ్మకం కలుగుతుంది. తాము జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొంటే అధిష్టానం చర్యలు తీసుకుంటే ప్రశ్నించడానికి అవకాశం దక్కుతుంది. కడప జిల్లా శాసనసభ్యులపై చర్య తీసుకోకుండా తమపై చర్య తీసుకోవడం వివక్ష ప్రదర్శించడమేననే విమర్శ బయలుదేరుతుంది. దీనివల్ల పార్టీ అధిష్టానం ఆత్మరక్షణలో పడే వీలుంటుంది. తన ఓదార్పు యాత్రలో పాల్గొంటే ఏమీ కాదని ప్రకాశం జిల్లా శాసనసభ్యులకు సంకేతం ఇవ్వడానికే జగన్ మొదట పులివెందుల నియోజకవర్గంలో ఓదార్పు యాత్రను చేపట్టారు.
కాగా, పార్టీ అధిష్టానం అనుమతి లేకుండానే వచ్చే నెల 2వ తేదీన తిరుపతిలో దివంగత నేత వైయస్ సంస్మరణ సభను తలపెట్టారు. అందుకు సంబంధించిన పోస్టరును కూడా జగన్ విడుదల చేశారు. ఇది కూడా అధిష్టానాన్ని ధిక్కరించడమే అవుతుంది. వైయస్ తన తండ్రి కావడాన్ని జగన్ తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తన తండ్రి సంస్మరణ జరిపే హక్కు, బాధ్యత కుమారుడిగా తనకు లేదా అని ప్రశ్నించేందుకు వీలుగా ఆయన దీన్ని ఖరారు చేసుకున్నారు. అధిష్టానం తనకు వ్యతిరేకంగా చర్య తీసుకుంటే అదే జగన్ ప్రధాన ఆయుధం కూడా అవుతుంది. అయితే, ఈ రాజకీయ క్రీడలో జగన్ ఎంత దూరం వెళ్తారనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది.












Click it and Unblock the Notifications