అంబటి రాయుడు, వేణు పట్ల వివక్ష
ఐపియల్ మ్యాచులు కాబట్టి వీరబాదుడు బాదితే సరిపోతుందనే విధంగా వారి ఆట తీరు లేదు. భారీ షాట్లకు దిగుతూనై శాస్త్రీయమైన ఆటతీరును వీరు ప్రదర్శించారు. వీరిద్దరు బౌలింగ్ కూడా చేయగలరు. ఈ విషయం భారత క్రికెట్ పెద్దలందరికీ తెలుసు. కానీ జాతీయ జట్టులో వారికి స్థానం దక్కదు. వేణుగోపాల రావుకు సురేష్ రైనాతో పాటు స్థానం కల్పించినట్లే కల్పించి, ఆ తర్వాత మెల్లగా తప్పించారు. ఒకటి రెండు సార్లు విఫలమైతే తెలుగు క్రికెటర్లను పూర్తిగానే పక్కన పెట్టేసే పెద్దలు సురేష్ రైనా వంటి ఉత్తర భారత క్రికెటర్ల పట్ల మాత్రం మరో విధంగా వ్యవహరించడం చూస్తూనే ఉన్నాం. మొత్తం దక్షిణాదికే క్రికెట్ క్రీడలో అన్యాయం జరుగుతోందనేది కాదనలేని సత్యం.
ఇటీవలి ప్రపంచ కప్ పోటీల సందర్బంగా అశ్విన్ను కాకుండా పియూష్ చావ్లాను భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తుది జట్టులోకి తీసుకున్నాడు. పియూష్ చావ్లా ఘోరంగా విఫలమయ్యాడు. దీనిపై బిసిసిఐ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ధోనీపై మండిపడ్డాడు కూడా. కేరళ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ కూడా అదే విధమైన వివక్షను ఎదుర్కుంటున్నాడు. శ్రీశాంత్ దూకుడుపై ధోనీ వ్యాఖ్యలను బట్టే ఆ వివక్షను అర్థం చేసుకోవచ్చు. జూనియర్ల పట్ల వీరేంద్ర సెహ్వాగ్ వంటి సీనియర్లు ఎంత చిన్నచూపును ప్రదర్శిస్తారో పలు మార్లు తెలిసి వచ్చింది. మొత్తంగానే దక్షిణాది క్రికెటర్ల పట్ల (కొంత వరకు ఇప్పుడు కర్ణాటకను మినహాయించవచ్చు) వివక్ష కొనసాగుతూ వస్తోంది.
శ్రీశాంత్ను శ్రీశాంతే నియంత్రించుకోవాలని, శ్రీశాంత్ను నియంత్రించడం ఎవరి వల్లా కాదని ధోనీ ఆ మధ్య వ్యాఖ్యానించాడు. దూకుడును నియంత్రించే పేరుతో శ్రీశాంత్ ప్రతిభను దెబ్బ తీసే ప్రయత్నాలు అంతర్గతంగా జరిగాయనేది అర్థం చేసుకోవచ్చు. న్యూనతా భావానికి గురి చేయడం ద్వారా, జట్టు సభ్యులు కలివిడిగా వ్యవహరించకపోవడం ద్వారా వారిని దెబ్బ తీసే ప్రయత్నాలు మొదటి నుంచీ జరుగుతూ వస్తున్నాయి. వివియస్ లక్ష్మణ్ భారత జట్టు కెప్టెన్ అయ్యే దశలో అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేసిన చేసిన పని అదే. లక్ష్మణ్కు జట్టులో స్థానమే సందేహంగా మారే పరిస్థితి కల్పించారు.