బాబుకు వారిద్దరితోనే గుబులు
తెలంగాణపై చంద్రబాబు వైఖరి వల్ల నాగం జనార్దన్ రెడ్డి ఏం చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. అయినా, చంద్రబాబు తన పద్ధతిని మార్చుకోవడం లేదు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగం బొట్లు అనే విధంగా తయారైంది. దానికి తోడు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చంద్రబాబుపై, తెలుగుదేశం తెలంగాణ నాయకులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. కెసిఆర్ను తిప్పికొట్టే నైతిక బలం తెలుగుదేశం తెలంగాణ నాయకులకు సంతరించుకోలేకపోతున్నారు. దీనిపై చంద్రబాబు పార్టీ నాయకులను తప్పు పడుతున్నారే గానీ తన విధానంపై పునరాలోచన చేయడం లేదు. దీంతో కెసిఆర్ ఆయనకు పెద్ద సమస్యగా తయారయ్యారు. ఎన్నికలే కనుక జరిగితే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో వేరే చెప్పాల్సిన పని లేకుండా ఉంది.
ఇదిలా వుంటే, తెలంగాణలో కాలు పెట్టలేని స్థితిలో ఉన్న చంద్రబాబు సీమాంధ్రలో తన క్యాడర్ను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన రైతు సమస్యలపై సీమాంధ్రలో పర్యటిస్తున్నారు. ఆయన సభలకు ప్రజలు వస్తున్నారు. కానీ, జగన్ను ఢీకొనే స్థితిలో ఆ బలం ఉందా అనేది అనుమానమే. దానికితోడు, పార్టీ క్యాడర్, ద్వితీయ శ్రేణి నాయకులు జగన్ వైపు చూస్తున్నారు. ఇటు కాంగ్రెసు నుంచి, అటు జగన్ నుంచి సీమాంధ్రలో చంద్రబాబు పోటీని ఎదుర్కుంటున్నారు. పార్టీని కాపాడుకోవడానికి కోస్తాంధ్రలో కూడా చంద్రబాబు పర్యటనలు చేస్తున్నారే తప్ప నాయకులు కదలడం లేదు. అది చంద్రబాబుకు సమస్యగా మారింది. జగన్ ఎప్పటికప్పుడు కోస్తాంధ్రలో వివిధ సమస్యలపై ఆందోళనలకు దిగుతున్నారు. బలప్రదర్శనకు దిగుతున్నారు. తాజాగా ఫిబ్రవరిలో పోలవరంపై పాదయాత్రకు దిగుతున్నారు. దూకుడుగా ముందుకు సాగుతున్న జగన్కు దీటుగా తాను కదలడం కూడా చంద్రబాబుకు కష్టంగానే ఉంది.
చంద్రబాబు వైఖరిపై ఇటు జగన్ వర్గం, అటు తెరాస నాయకులు ఎప్పటికప్పుడు విమర్శల జడివాన కురిపిస్తూనే ఉన్నారు. వారికి దీటైన సమాధానం ఇవ్వడంలో తెలుగుదేశం నాయకులు విఫలమవుతున్నారు. తప్పదన్నట్లుగా కొంత మంది మాట్లాడుతున్నారే తప్ప సీనియర్లు పెద్దగా ముందుకు రావడం లేదు. చంద్రబాబు ప్రజల విశ్వాసాన్ని పొందడం ఇంత సులభమైన విషయం కాదని ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే అర్థమవుతోంది.