బాపూజీకి బాబు ప్రమోషన్, కెసిఆర్కు జోష్
కెసిఆర్కు, తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్కు ప్రత్యామ్నాయంగా మరో జెఎసిని ఏర్పాటు చేయడానికి తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులు తీవ్ర ప్రయత్నాలే చేశారు. వారి ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించి ఓ రూపం తీసుకున్నట్లు అనిపించడమే తరువాయి ఎదురు దెబ్బ తగిలే పరిస్థితి వచ్చింది. కొండా లక్ష్మణ్ బాపూజీ నేతృత్వంలో మరో జెఎసిని ఏర్పాటు చేయడంలో తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు విజయం సాధించారు. అయితే, కొండా లక్ష్మణ్ బాపూజీ వెనక చంద్రబాబు ప్రోద్బలం ఉందనే వార్తలు గుప్పుమన్నాయి. చంద్రబాబు ప్రోద్బలం, ప్రోత్సహం ఉందనే మాట బయటకు రావడంతో కెసిఆర్కు జోష్ వచ్చిందనే చెప్పాలి. చంద్రబాబు నేతృత్వంలో పనిచేసే జెఎసిని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు.
రాష్ట్ర సాధన తెలంగాణ సమన్వయ కమిటీ ఏర్పాటు తర్వాత దానికి చైర్మన్గా వ్యవహరిస్తున్న కొండా లక్ష్మణ్ బాపూజీ టీవీ చానెళ్లలో చర్చా గోష్టుల్లో పాల్గొనే ఏర్పాట్లు కూడా చంద్రబాబు నాయుడే చేశాడని ప్రచారంలోకి వచ్చింది. బాపూజీ వివిధ టీవీ చానెళ్లలో పాల్గొని తెలంగాణ సాధనపై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును విమర్శించారు. కోదండరామ్ను తప్పు పట్టారు. దీంతో తెలంగాణ ప్రజలు కొండా లక్ష్మణ్ బాపూజీ వెనక చంద్రబాబు ఉన్నారని, అందుకే బాపూజీ అలా మాట్లాడుతున్నాని అనుకుంటున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఏమైనా, ఇది కెసిఆర్కు కలిసి వచ్చిందనే చెప్పాలి.