కెసిఆర్ను ఢీకొనేందుకు చంద్రబాబు సై
ఇటీవల బాన్సువాడ ఉప ఎన్నికల్లో బాబు పోటీకు సిద్ధపడినప్పటికీ టిటిడిపి ఫోరం సూచన మేరకు వెనక్కి తగ్గారు. కానీ ఫలితం తారుమారైంది. ఎంతో మెజార్టీ వస్తుందనుకున్న పోచారంకు దాదాపు యాభై వేలు మాత్రమే వచ్చింది. దీనికి బాబు అప్పుడే టిటిడిపి నేతలకు క్లాస్ పీకినట్లు వార్తలు వచ్చాయి. బాన్సువాడ ఉప ఎన్నికల నుండి గుణపాఠం నేర్చుకున్న టిడిపి ఇక ఎక్కడ ఎన్నికలు జరిగినా వెనక్కి తగ్గేది లేదని అప్పుడే ప్రకటించింది. చంద్రబాబు కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు.
ఇన్నాళ్లూ తెలంగాణ ప్రాంతంలో తిరగడానికి ఇబ్బందులు పడ్డ టిడిపి పోలవరం పుణ్యమా అని కెసిఆర్ను తీవ్ర ఇరకాటంలో పడేసిందనే చెప్పవచ్చు. ఇప్పుడు అదే ఊపులో ఉప ఎన్నికలకు కూడా సన్నద్ధమవుతోంది. బాన్సువాడలో వెనక్కి తగ్గినా ఇప్పుడు వచ్చే ఉప ఎన్నికల్లో మాత్రం వెనక్కి తగ్గవద్దని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మహబూబ్ నగర్, కొల్లాపూర్, స్టేషన్ ఘనపూర్, అదిలాబాద్, పరకాల, కామారెడ్డి నియోజకవర్గాల్లో అభ్యర్థులను దాదాపు ఖరారయ్యారు. కేవలం నాగం జనార్ధన్ రెడ్డి ప్రాతినిథ్యం వహించిన నాగర్ కర్నూల్ విషయంలోనే తర్జన భర్జన పడుతున్నట్లు కనిపిస్తోంది.