చిరుకు ఖరారు, రాజ్యసభ సీట్లకు పోటీ
చిరును రాజ్యసభకు పంపడం దాదాపుగా ఖరారు కావడంతో కాంగ్రెసులో మరో నాలుగు సీట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెసు అధిష్టానం మూడోసారి రషీద్ అల్వీకి రాజ్యసభ టికెట్ ఇవ్వవచ్చునని భావిస్తున్నారు. మిగతా వారిని తిరిగి నామినేటయ్యే అవకాశాలు లేవని అంటున్నారు. ఈ మూడు సీట్ల కోసం మాజీ పార్లమెంటు సభ్యుడు మల్లు రవి, ఎఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి, శాసనసభ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. పిసిసి మాజీ అధ్యక్షుడు పి. నరసారెడ్డి కూడా రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
చిరంజీవిని జనవరిలో లేదా ఫిబ్రవరిలో కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుని, ఏప్రిల్లో రాజ్యసభకు ఎంపిక చేసే అవకాశం ఉంది. రేణుకా చౌదరి ఢిల్లీలో పావులు కదుపుతున్నారు. మల్లు రవి ఇటీవల ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. సురేష్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. మొత్తం మీద పోటీ తీవ్రంగానే ఉండే అవకాశం ఉంది. మరో రెండు సీట్లను తెలుగుదేశం పార్టీ దక్కించుకునే అవకాశం ఉంది.