మార్చిలో తెలంగాణకు పరిష్కారం?
మార్చి ఒకటి తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేసేందుకు నిర్ణయం తీసుకుంది. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు ఈ విషయంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ భాగస్వామ్య పక్షాల సహకారం సంపూర్ణంగా లభిస్తుందనే చెప్పవచ్చు. తెలుగుదేశం తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు కూడా ఇందులో పాలుపంచుకుంటారు. ప్రతిపక్షాల ఆందోళన వల్ల క్రెడిట్ కెసిఆర్కు వెళ్తుందనే భయంతో కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు కూడా పార్లమెంటును స్తంభింపజేసే విషయంలో దూకుడుగా వ్యవహరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన చేయకపోతే తాము రాజీనామాలు చేస్తామని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు ఇప్పటికే అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తోంది. ఒత్తిడి పెరగడంతో కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు కూడా శాసనసభను స్తంభింపజేసే కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనే అవకాశాలున్నాయి. దానికితోడు మార్చి మొదటి వారంలో రాజీనామా లేఖలతో వారు ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాజీనామా లేఖలు సమర్పించాలని వారు నిర్ణయించుకున్నారు.
ఆ పరిణామాల నేపథ్యంలో మార్చి మొదటివారంలో తెలంగాణ సమస్యకు పరిష్కారం కనిపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ రెండు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నప్పటికీ పార్టీపరంగా తాము ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చి దాన్ని ప్రకటించాలని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాదు పీఠముడిని విప్పితే సమస్య పరిష్కారమవుతుందని కాంగ్రెసు అధిష్టానం భావిస్తోంది. అందుకు తగిన కసరత్తు చేస్తోంది. శ్రీకృష్ణ కమిటీ సూచించినట్లు తెలంగాణకు అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసి, పదేళ్లు ప్రయోగం చేయడం, అది విఫలమైతే తెలంగాణ ఏర్పాటు చేయడం అనే ఆలోచన కాంగ్రెసు అధిష్టానం వద్ద ఉంది. ఆలాగే, కేంద్ర పాలితంగా హైదరాబాద్ను ఉంచేసి, రెండు రాష్ట్రాలు ఏర్పాటు చేసి వేర్వేరు రాజధానులు ఏర్పాటు చేసుకునేందుకు సమయం ఇవ్వడం అనేది మరో ప్రత్యామ్నాయం. హైదరాబాద్ను కొద్ది సంవత్సరాల పాటు సంయుక్త రాజధానిగా ప్రకటించి, రెండు రాష్ట్రాలు ఏర్పాటు చేయడమనేది కాంగ్రెసు అధిష్టానం వద్ద మరో ప్రత్యామ్నాయం. ఈ మేరకు త్వరలో కచ్చితమైన నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం మార్చి మొదటి వారంలో పార్లమెంటులో ప్రకటించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.