జూ.ఎన్టీఆర్, నారా లోకేష్ ఫైట్ ఖతమ్
నారా లోకేష్ చేత రాజకీయ రంగ ప్రవేశం చేయించాలనే ప్రయత్నాలను చంద్రబాబు విరమించుకోవడంతో ఆ పోరాటం ముగిసినట్లు భావిస్తున్నారు. చాలా ఎడమొహం పెడమొహంగా ఉంటూ వస్తున్న చంద్రబాబు, హరికృష్ణ ఇటీవల ఢిల్లీలో చేతులు కలిపినట్లు సమాచారం. అంతర్గత పోరు వల్ల లాభం కన్నా నష్టం జరుగుతుందని భావించి చంద్రబాబు వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. ఇప్పటికే, జగన్ వల్ల సీమాంధ్రలో, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వల్ల తెలంగాణలో పార్టీ పరిస్థితి ఏ మాత్రం బాగా లేదు. దీంతో పార్టీని కాపాడుకోవాలంటే అంతర్గత పోరుకు స్వస్తి చెప్పాలని ఆయన అనుకున్నట్లు చెబుతున్నారు.
పార్టీని బలోపేతం చేసి 2014 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని, ఆ తర్వాతనే లోకేష్కు పగ్గాలు అప్పగించే విషయంపై ఆలోచించాలని చంద్రబాబు అనుకున్నట్లు తెలుస్తోంది. దీంతో నారా లోకేష్ వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా కొంత కాలం ఆగడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ తర్వాతనే తేల్చుకుందామనే ఉద్దేశంతో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు.