జగన్ వ్యూహం ఫలిస్తుందా?

కర్నూలు జిల్లా ఓదార్పు యాత్రలోనూ, ఇతర కార్యక్రమాల్లోనూ ఆయన తనపై కేసులు వేయడాన్ని కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల కుట్రగానే అభివర్ణిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రజల ముందుకు ఆయన పదే పదే తీసుకుని వెళ్తున్నారు. ఇందులో వైయస్ జగన్ వ్యూహం దాగి ఉందని అంటున్నారు. తాను కాంగ్రెసులో ఉన్నంత వరకు ఏమీ జరగలేదని, తాను కాంగ్రెసు నుంచి బయటకు వచ్చిన తర్వాతనే వేధింపు చర్యలకు దిగుతున్నారని ఆయన ప్రజల ముందు చెబుతున్నారు. అయితే, జగన్ హుందాగా సిబిఐ విచారణకు అంగీకరించి ఉంటే బాగుండేదని, తప్పు చేశారు కాబట్టి సిబిఐ విచారణకు ముందుకు రావడం లేదని రాజకీయ విశ్లేషకులు, మేధావులు కూడా అంటున్నారు. కానీ జగన్ ఆలోచన మరో విధంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
పార్టీ వ్యూహాలు, ఆచరణలు ప్రజలకు స్పష్టంగా తెలుసు కాబట్టే జగన్ ఆ విధమైన వ్యూహాన్ని ఎంచుకున్నారని చెప్పవచ్చు. కాంగ్రెసులో ఉన్నంత వరకు వైయస్ జగన్ ఆస్తులపై మాట్లాడనివారు ఇప్పుడు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారని, అప్పుడు కనిపించని అక్రమాలు ఇప్పుడే కనిపించాయా అని వాదించడం వల్ల ప్రజల్లో సానుభూతి లభిస్తుందని అంటున్నారు. కాంగ్రెసు నుంచి బయటకు వచ్చారు కాబట్టే కాంగ్రెసు పెద్దలు జగన్ అస్తులపై మాట్లాడుతున్నారనే విషయం ప్రజలకు స్పష్టంగా తెలుసు. కాంగ్రెసులో ఉండి ఉంటే జగన్ ఆస్తులపై మాట్లాడి ఉండేవారు కారని కూడా వారికి తెలుసు. ఇది తనకు అనుకూలంగానూ, కాంగ్రెసుకు ప్రతికూలంగానూ పనిచేస్తుందని జగన్ నమ్ముతున్నారని చెప్పవచ్చు. అందుకే ఆయన బయటకు వేరే రకంగా కనిపిస్తున్నా జగన్ ఆ విధమైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారని చెప్పవచ్చు. ఇలా వెళ్లడం పల్ల ఫలితం తనకు అనుకూలంగా ఉంటుందని కూడా ఆయన అనుకుంటున్నారు.












Click it and Unblock the Notifications