చిరంజీవికి 'మెగా' ట్రబుల్

గతంలో ఆరోగ్యం బాగా లేక పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అమెరికాకు వెళ్లిపోతే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెసులో చేరిపోయి చిరంజీవి సర్దుకున్నారు. ఆ తర్వాత పార్టీలో, ప్రభుత్వంలో పదవుల భర్తీ దిశగా కాంగ్రెసు అడుగులు వేస్తున్న సమయంలో తెలంగాణ సకల జనుల సమ్మె ముంచుకొచ్చింది. కాంగ్రెసు పార్టీ కార్యనిర్వాహక కమిటీని, కోర్ కమిటీని వేయాలని నాయకత్వం భావించింది. కోర్ కమిటీలో చిరంజీవిని వేస్తారని కూడా వార్తలు వచ్చాయి. కానీ అది ముందు పడలేదు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గ విస్తరణకు కూడా ఎప్పటికప్పుడు ఆటంకాలు ఎదరువుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రిని కుదురుగా ఆలోచించనివ్వని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికితోడు, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పక్కలో బల్లెంలా తయారయ్యారు. దీంతో ఆయన ఉక్కిరిబిక్కిరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణకు పరిస్థితి అనుకూలించకపోవడంతో ప్రజారాజ్యం పార్టీ నుంచి కాంగ్రెసులోకి వచ్చిన శాసనసభ్యులకు పదవులు దక్కడం అందని ద్రాక్షలే అయ్యాయి. పార్టీ అధిష్టానం పూర్తిగా తెలంగాణ సమస్యను పరిష్కరించడంలో మునిగిపోవడంతో చిరంజీవికి, ఆయనను నమ్నుకున్నవాళ్లకు ఇటీవలి కాలంలో మంచి రోజులు వచ్చేట్లు లేవనిపిస్తోంది. చిరంజీవి బొత్స సత్యనారాయణకో, కిరణ్ కుమార్ రెడ్డికో రెండో శ్రేణి నాయకుడిగా వ్యవహరించాల్సి వస్తోంది.












Click it and Unblock the Notifications