తెలంగాణకు అడ్డు ఆ నలుగురేనా?
తెలంగాణ ఇస్తే సీమాంధ్రకు చెందిన అందరు పార్లమెంటు సభ్యులు వ్యతిరేకిస్తారని, దానివల్ల కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ప్రమాదం ఏదీ లేదని ఆయన ప్రణబ్ ముఖర్జీతో చెప్పినట్లు సమాచారం. తెలంగాణ ఇస్తే వైయస్ జగన్ వెంట వెళ్తామని సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు బెదిరిస్తున్నారని వచ్చిన వాదన నేపథ్యంలో కేశవరావు తన లెక్కలను అధిష్టానం ముందు పెట్టినట్లు తెలుస్తోంది.
తెలంగాణను కరాఖండిగా వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు నలుగురు మాత్రమేనని అంటున్నారు. లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివ రావు, కావూరి సాంబశివరావు, అనంత వెంకటరామిరెడ్డి మాత్రమే తెలంగాణను వ్యతిరేకిస్తూ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని, మిగతా సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు అంత గట్టిగా లేరని అంటున్నారు. సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు కిల్లి కృపారాణి, బొత్స ఝాన్సీ, చింతా మోహన్ తెలంగాణపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మనస్పూర్తిగానే చెబుతున్నారని అంటున్నారు.
మిగతావారిలో చాలా మంది తెలంగాణ పట్ల గతంలో ఉన్నంత పట్టుతో ఇప్పుడు లేరని, వారికి నచ్చజెప్తే వింటారని అంటున్నారు. కాగా, తెలంగాణను వ్యతిరేకిస్తున్న సబ్బం హరి, మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇప్పటికే వైయస్ జగన్ వైపు వెళ్లారని, వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. వైయస్ జగన్ రాజీనామా చేశారు కాబట్టి సమస్య లేదని వాదిస్తున్నారు.
సగానికిపైగా సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే వ్యతిరేకించబోరని, ఆ లెక్కలతో చూస్తే తెలంగాణ నుంచి 11 లోకసభ సభ్యులున్నారని, లెక్కలు సరిపోతాయని అంటున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు తెలంగాణ పట్ల పూర్తి వ్యతిరేకతతో లేరని, వారికి పరిస్థితిని వివరించి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి వీలుందని అంటున్నారు.
కేంద్ర మంత్రులు దగ్గుబాటి పురంధేశ్వరి, పళ్లంరాజు వంటి వారి నుంచి కూడా వ్యతిరేకత రాదని అంటున్నారు. అసంతృప్తితోనైనా ఎక్కువ మంది సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు తెలంగాణకు అనుకూలంగా అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటే అంగీకరిస్తారనే వాదన వినిపిస్తోంది. ఈ స్థితిలో బడ్జెట్ సమావేశాల్లోగానే తెలంగాణ అంశాన్ని తేల్చేయాలనే పట్టుదలతో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.