కోవర్టు ఆపరేషన్ ద్వారా పటోళ్ల హత్య!

పటోళ్ల తను నమ్మిన బంటు నగేష్ అలియాస్ అనిల్ చేసిన కోవర్టు ఆపరేషన్కే బలయ్యాడు. 35 కోట్ల రూపాయల భూ వివాదాన్ని సెటిల్ చేసే క్రమంలో పలువురికి పటోళ్ల శత్రువయ్యాడని పోలీసు దర్యాప్తులో తేలింది. ఆయనకు నమ్మిన బంటుగా ఉన్న నగేష్ తన సెల్ఫోన్ను హత్యకు ఒక రోజు ముందు నుంచే స్విచాఫ్ చేసేశాడట. అతడి భార్య కూడా హత్య జరిగిన వెంటనే తన ఫోన్ను ఇంట్లోనే వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందట. గోవర్ధన్రెడ్డి హత్యపై అదనపు కమిషనర్ అమిత్ గార్గ్ ఆధ్వర్యంలో ఐదు పోలీసు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు అనుమానంతో పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు కూడా. హత్య తీరు తెన్నులను బట్టి చూస్తే నగేష్ ఒక్కడే ఈ హత్యకు పాల్పడి ఉండడని, అతని వెనుక ఏదో శక్తి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
కోవర్టు ఆపరేషన్ల ద్వారా ప్రత్యర్థులను మట్టుపెట్టడంలో స్పెషలిస్టు అయిన నయీముద్దీన్ చేతిలో నగేష్ పావుగా మారాడన్న కోణంలోనూ విచారణ సాగుతోంది. స్థల వివాదం కారణంగానే పటోళ్ల హత్యకు గురైనట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పటోళ్ల జైల్లో ఉన్నప్పటి నుంచే ఈ స్థలం డాక్యుమెంట్లన్నీ సేకరించిన నగేష్ తన వాటా అందకపోవడంతో గోవర్ధన్రెడ్డి మీద పగ పెంచుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పటోళ్ల ప్రత్యర్థులు నగేష్ను చేరదీసి, అతడితో గోవర్ధన్రెడ్డిని హత్య చేయించి ఉండొచ్చనే కోణంలో విచారణ సాగుతోంది.












Click it and Unblock the Notifications