తెలంగాణ ఇష్యూ: కెకె ట్రాప్లో కెసిఆర్

కేశవరావుకు జనబలం లేకపోయినప్పటికీ తన పదునైన వ్యూహాల ద్వారా నరుక్కురావడం అలవాటు అంటారు. దాని ద్వారానే తెలంగాణలో తెరాసను బలహీనపరిచి, కాంగ్రెసు పైచేయి సాధించడానికి అవసరమైన వ్యూహాన్ని కేశవరావు చాలా కాలంగా అమలు చేస్తున్నారని అంటున్నారు. కాంగ్రెసులోని పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి అతివాదుల ద్వారా కేశవరావు నరుక్కుని వస్తున్నారని అంటున్నారు. ఐక్యంగా ముందుకు సాగుతామని అంటూనే తెరాసకు, తెలంగాణ జెఎసికి కాంగ్రెసు తెలంగాణ నేతలు దూరం పాటిస్తూ వస్తున్నారు. తెలంగాణ జెఎసి ఇచ్చిన ఆందోళనల్లో తమది ప్రధాన పాత్ర అయ్యేలా వ్యవహరిస్తున్నారు. ఇటీవలి రైల్ రోకో కార్యక్రమంలో కాంగ్రెసు పార్లమెంటు సభ్యుల అరెస్టు, వారిపై నాన్ బెయిలబుల్ కేసుల నమోదు వంటి అంశాలు కాంగ్రెసును తెరాసపై పైచేయి సాధించేలా చేసింది. కేశవరావును నమ్ముకుని కెసిఆర్ వ్యూహాలు మారుస్తుండడమే తెరాసకు ప్రాణసంకటంగా మారిందని చెబుతున్నారు. దానివల్లనే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని సమాచారం.
తెలంగాణ కోసం ఎంత దూరమైనా పోతామంటూనే కాంగ్రెసు తెలంగాణ నాయకులు ఒక్కో నెల వాయిదా వేస్తూ వస్తున్నారు. నెలాఖరు, నెలారంభం అంటూ డెడ్లైన్లను మారుస్తూ వస్తున్నారు. తాజాగా, కాంగ్రెసు తెలంగాణ నాయకులు నవంబర్ మొదటి వారం చెబుతున్నారు. నవంబర్ మొదటివారంలో తెలంగాణపై నిర్ణయం వెలువడుతుందని చెబుతున్నారు. తెలంగాణకు అనుకూలంగా తమ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోబోతున్నట్లు సంకేతాలు అందాయని కేశవరావు మంగళవారం సాయంత్రం వ్యూహాత్మకమైన ప్రకటన చేశారు. తెరాసకు దీటుగా తెలంగాణలో కాంగ్రెసు బలం పుంజుకోవడానికి అవసరమైన వ్యూహాన్ని కేశవరావు చేతుల మీదుగా అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇది గమనించే తెలంగాణ రాజకీయ జెఎసి కాంగ్రెసును టార్గెట్ చేసుకుని ఉద్యమ కార్యాచరణకు పూనుకుంటామని ప్రకటించినట్లు చెబుతున్నారు. తమను టార్గెట్ చేసుకుంటామని తెలంగాణ జెఎసి ప్రకటించగానే కాంగ్రెసు తెలంగాణ స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించి కాస్తా దూకుడుగా ముందుకు వస్తున్నట్లు చెబుకున్నారు. తెరాస వ్యూహంలో కొట్టుకుపోకుండా, తెరాసకు బ్రేకులు వేసే పద్ధతిలోనే కాంగ్రెసు తెలంగాణ నాయకులు వ్యవహరిస్తున్నారనే మాట వినిపిస్తోంది. ఇది ఏ రూపం తీసుకుంటుందో చూడాల్సిందే.












Click it and Unblock the Notifications