కిరణ్పై రెచ్చిపోయిన జగన్ క్యాంప్
కిరణ్ కుమార్ రెడ్డిది తుమ్మితే ఊడిపోయే ముక్కు అని వారన్నారు. దమ్ముంటే రాజీనామా చేసి వైయస్ రాజశేఖర రెడ్డి ఫొటో లేకుండా గెలవాలని, సోనియా బొమ్మ మాత్రమే పెట్టుకోవాలని, తాము వైయస్ రాజశేఖర రెడ్డి ఫొటో పెట్టుకుని పోటీ చేస్తామని వారన్నారు. తమ సంఖ్యాబలం చూస్తే దిమ్మ తిరుగుతుందని వారన్నారు. ఈ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దయపై ఏర్పడినదని, ఇది ఆయన భిక్ష అని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు. ఎమ్మెల్యేలు ఈ దీక్షకు రావడం అనైతికమని కిరణ్ కుమార్ రెడ్డి అనడాన్ని ఆయన ఖండించారు. అనైతికం ఎవరిదో ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఆలోచించాలన్నారు. ఈ ప్రభుత్వం వైఎస్ పెట్టిన భిక్ష అన్నారు. నాన్న తీసుకువచ్చిన ప్రభుత్వం, రాజీనామా చేయవద్దని జగన్మోహన రెడ్డి కోరినందునే తాము రాజీనామా చేయలేదన్నారు.
పెట్రోల్, నిత్యావసర సరుకుల ధరల పెంపునకు నిరసనగా జగన్ చేపట్టిన దీక్ష రాజకీయ దీక్షగా మారిపోయింది. రాజకీయ సవాళ్లకు జగన్ వర్గం నాయకులు ప్రాధాన్యం ఇచ్చారు. సమస్య పక్కదారి పట్టింది. వైయస్ రాజశేఖర రెడ్డిని, వైయస్ జగన్ను ప్రశంసించడానికి, కాంగ్రెసునూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునూ విమర్సించడానికి వక్తలు ప్రాధాన్యం ఇచ్చారు.