రామోజీ మిస్టర్ ఫోర్ ట్వంటీ?
రామోజీ రావును మిస్టర్ ఫోర్ ట్వంటీగా సాక్షి దినపత్రిక అభివర్ణించింది. తప్పుడు లెక్కలతో వార్తాకథనాన్ని ప్రచురించారని ఆరోపించింది. జగన్ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు రామోజీ రావు 420 రాతలు రాస్తున్నారని వ్యాఖ్యానించింది. 2006 నాటి భవనం కొనుగోలుకు, విక్రయ సంస్థ 2008లో జరిపిన లావాదేవీలకు లింకు పెడుతూ ఈనాడు దినపత్రిక వార్తాకథనాన్ని ప్రచురించిందని ఆడిపోసుకుంది. రామోజీ రావు పెట్టుబడుల వ్యవహారంపై చర్చకు సిద్దపడుతారా అని ప్రశ్నించింది. కోర్టుకు హాజరు కావాల్సిన స్థితి వచ్చే సరికి రామోజీ రావుకు దిక్కు తోచడం లేదని వ్యాఖ్యానించింది.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కోసం రామోజీ రావు పనిచేస్తున్నారని వైయస్ జగన్ వర్గం మొదటి నుంచీ ఆరోపిస్తోంది. ఈనాడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వార్తలు రాస్తుందనేది పాఠకులకు తెలియని విషయం కాదు. కానీ ప్రత్యర్థుల మీద దాడి చేసే సమయంలో రాసే వార్తాకథనాల్లో హేతుబద్దత ఉంటుంది. తెలుగుదేశ పార్టీకి, రామోజీరావుకు లక్ష్యం వైయస్ జగన్, సాక్షి మీడియానే అని సాక్షి దినపత్రిక వార్తాకథనం అభిప్రాయపడింది. 2006నాటికే జగన్ బెంగుళూర్లో కొన్న కామర్స్ ఎట్ మంత్రి భవనం విలువ రూ. 400 కోట్లు ఉంటుందని రామోజీ లెక్క కట్టారని, దాన్ని జగన్ 350 కోట్ల రూపాయలకు అమ్మడానికి సిద్ధంగా ఉన్నారని, దాన్ని రామోజీ రావు కొంటారా అని సాక్షి పత్రిక రాసింది. ఫ్లాప్ సినిమా రీళ్ళు, ఈటీవీ సీరియళ్ళు పూచీకత్తుగా పెట్టి రూ.827 కోట్లు పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల నుంచే లాగిన రామోజీకి... ఆ మాత్రం సొమ్ము ఎంత ఈజీగా పుట్టించవచ్చో వేరెవరో నేర్పించాల్సిన అవసరమే లేదని వ్యాఖ్యానించింది.