చేయిచ్చిన ఎమ్మెల్యేలకు జగన్ షాక్
జగన్ అంటే అభిమానమని చెబుతూ వచ్చిన సత్యవతి తన భర్తపై వేటు పడగానే మరో విధంగా ప్రతిస్పందించారు. జగన్ ఏకపక్ష వైఖరి నచ్చకపోవడం వల్లనే తాను తిరిగి కాంగ్రెసులోకి వచ్చానని ఆమె చెప్పారు. తనతో ఉంటూ వస్తున్న కొంత మంది శాసనసభ్యులు డబుల్ గేమ్ ఆడుతున్నారని జగన్ కూడా గ్రహించారు. దానికి స్వస్తి చెప్పాలని ఆయన సూచించారు. తనతో చిత్తశుద్ధితో ఉండేవాళ్లే ఉండాలని, డబుల్ గేమ్ ఆడుతున్నవారు తన వద్దకు రావాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టంగానే చెప్పారు. ఆ తర్వాత కూడా కొంత మంది ఇటూ అటూ ఉంటూ ఎటు ఉంటారో తెలియకుండా వ్యవహరిస్తున్నారు.
వైయస్ జగన్ వెంట ఉండి, ఇప్పుడు ప్రభుత్వం వైపు తిరిగి వచ్చిన శాసనసభ్యులకు భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఉంది. తాము కాంగ్రెసుకు అనుకూలంగా ఓటేసినా తర్వాత జగన్ వైపు రావచ్చునని వారు అనుకుంటున్నారు. కానీ, అటువంటి వారిని భవిష్యత్తులో కూడా రానీయకూడదని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాంగ్రెసు పార్టీ కూడా వారిని వచ్చే ఎన్నికల్లో పక్కన పెట్టే అవకాశాలున్నాయి. అటు జగన్ వైపు వెళ్లి తమను ఇబ్బందుల్లో పెట్టిన శాసనసభ్యులను ప్రస్తుతం శాసనసభలో గట్టెక్కడానికి వాడుకున్నా తర్వాత వారిని విస్మరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వారు రెంటికి చెడిన రేవడి అయ్యే ప్రమాదమే ఎక్కువగా ఉంది.