జగన్ టార్గెట్ కిరణ్ కుమార్ జిల్లా
కాగా, కర్నూలు జిల్లాలో ఓదార్పు యాత్ర చేసిన తర్వాత తెలంగాణలో చేపట్టాలని ఆయన మొదట అనుకున్నారు. కర్నూలు జిల్లా నుంచి తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలోకి ప్రవేశించాలని తలపెట్టారు. కానీ ఇప్పుడు ఆయన తన మనసు మార్చుకున్నారు. తెలంగాణలో పరిస్థితులు మారనందువల్ల ఇప్పుడే పర్యటన చేయడం అంత మంచిది కాదని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణపై జగన్ తీసుకున్న వైఖరిపై కూడా విమర్శలు ఎదురవుతున్నాయి. తెలంగాణపై తీసుకున్న నిర్ణయం సమైక్యవాదానికి అనుకూలంగానే ఉందని తెలంగాణవాదులు అంటున్నారు. ఈ స్థితిలో తెలంగాణలో ఓదార్పు యాత్ర చేపట్టడం సాధ్యం కాదని అంటున్నారు.
తెలంగాణలో ఓదార్పు యాత్ర చేపడితే తెలంగాణవాదులను రెచ్చగొట్టినట్లవుతుందని, దాని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై తన వైఖరి వెల్లడించే వరకు వేచి చూడాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసు అధిష్టానం పార్టీలో ఇరు ప్రాంతాల నేతల మధ్య ఏకాభిప్రాయ సాధన కోసం సంప్రదింపులు జరుపుతున్న నేపథ్యంలో తెలంగాణ సమస్య ఒక కొలిక్కి రావచ్చునని, అప్పుడే తెలంగాణలో పర్యటనకు ఏర్పాట్లు చేసుకోవచ్చునని అంటున్నారు.