రేస్నుండి బొత్స ఔట్: చిరుకు పెరుగుతున్న మద్దతు
అంతకుముందు సిఎం రేసులో ఎవరి పేరైనా చెప్పినప్పుడు ఎవరైనా ఉండవచ్చునని, తానూ ఆశిస్తున్నానని చెప్పేవారు. కానీ రెండు రోజుల క్రితం మాత్రం ఆయన మాటలో స్వల్పంగా తేడా కనిపించిందని అంటున్నారు. మంత్రులు గంటా శ్రీనివాస రావు, సి.రామచంద్రయ్యలు చిరంజీవిని భవిష్యత్తు ముఖ్యమంత్రిగా అంటున్నారని, దీనిపై ఏమంటారని విలేకరులు ప్రశ్నించగా.. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటావని చెబుతూనే... చిరు సిఎం అయితే సంతోషిస్తానని కూడా వ్యాఖ్యానించారు.
2014 సాధారణ ఎన్నికలలో కాంగ్రెసు అధికారంలోకి వస్తే సిఎం కావాలని ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు బొత్స, చిరంజీవిలు కూడా కలలు కంటున్నారు. పాలనా పరంగా కిరణ్కు మైనస్ మార్కులు పడుతున్నాయి. దీంతో అతనికి పార్టీలో నుండి మద్దతు వచ్చే అవకాశం కష్టమే. ఇప్పుడు అతనికి అండగా ఉంటున్న వారు కూడా చివరి వరకు ఆయన వెన్నంటి ఉంటారని చెప్పలేం. ఆయన ఒంటెత్తు పోకడలే కిరణ్కు నష్టం కలిగిస్తున్నాయని అంటున్నారు. మొదట కిరణ్కు దగ్గరగా ఉన్న శ్రీధర్ బాబు వంటి మంత్రులు ఆయన ఏకపక్ష నిర్ణయాల వల్ల అసంతృప్తితో ఆయనకు దూరంగా జరిగారు.
ఎమ్మెల్యేల విషయం పక్కన పెడితే మంత్రివర్గంలో ఆయనకు అనుకూలంగా ఉన్న వారు వేళ్ల మీద లెక్కబెట్టేంత కంటే ఎక్కువగా ఉండరని అంటున్నారు. ఇలాంటి సమయంలో కిరణ్కు మరోసారి అవకాశం దక్కదని చెబుతున్నారు. ఇక బొత్స ఇటీవల మద్యం సిండికేట్ వంటి కేసుల కారణంగా అధిష్టానం నుండి చివాట్లు పెట్టించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు కూడా ఢిల్లీ పెద్దలు అవకాశమిచ్చే అవకాశం లేదంటున్నారు. ఈ విషయం తెలిసే బొత్స ఓ అడుగు వెనక్కి వేసి చిరంజీవి సిఎం అయితే సంతోషమే అని వ్యాఖ్యానించారని చెబుతున్నారు.
బొత్స, కిరణ్ల పరిస్థితి అలా ఉంటే చిరంజీవి వ్యక్తిగతంగా పార్టీలో పట్టు సాధించలేక పోతున్నప్పటికీ.. ఆయనకు క్రమంగా మద్దతు మాత్రం పెరుగుతోందని అంటున్నారు. చిరంజీవిని సిఎంగా చూడాలనుకుంటున్న వారు కాంగ్రెసులో పెరుగుతున్నారు. గతంలో కేవలం చిరంజీవి వర్గం(నాటి ప్రజారాజ్యం) నేతలే ఆయనను సిఎంగా చెప్పేవారు. అయితే ఇటీవల మంత్రులు గంటా, సిఆర్సీలు పలుమార్లు చిరంజీవిని భవిష్యత్తు సిఎం అంటూ ఊదరగొడుతున్నారు. వారి వ్యాఖ్యలకు కూడా మద్దతు వస్తోంది.
గతంలో జోగి రమేష్ వంటి కృష్ణా జిల్లా కాంగ్రెసు నేతలు చిరంజీవిని సిఎం అయితే తప్పు లేదని చెప్పారు. ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. తాజాగా కిరణ్ వర్గంగా ముద్రపడిన వరంగల్ జిల్లా నేత గండ్ర వెంకటరమణ రెడ్డి కూడా చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారని మంత్రులు చెప్పడంలో తప్పు లేదని, సంతోషమే కదా అన్నారు. బొత్స కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పార్టీలో కూడా జోరుగా ఈ విషయమై చర్చ జరుగుతోందట. మొత్తానికి సంవత్సరంన్నర తర్వాత వచ్చే ఎన్నికలకు అధిష్టానం చిరంజీవిని సిఎం అభ్యర్థిగా ప్రకటించినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదంటున్నారు. అందుకే మంత్రి పదవి ఊరిస్తున్నప్పటికీ ఆయనను వరించడం లేదనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.