చిరుకే కాదు, కిరణ్, చంద్రబాబులకు కూడా...
తమ చేతిలోని స్థానాన్ని ఎన్నికల వ్యవహారంలో కిరణ్ కుమార్ రెడ్డి, చిరంజీవి చేజేతులా పోగొట్టుకున్నారు. సామాజిక వర్గాలను నమ్ముకుని చంద్రబాబు చతికిలపడ్డారు. చిరంజీవి రాజీనామాతో ఖాళీ అయిన తిరుపతి స్థానం నిజానికి కాంగ్రెసు ఖాతాలో చేరాలి. కానీ, నాయకత్వ లోపం కాంగ్రెసు పార్టీని దెబ్బ తీసింది. అదే సమయంలో మంత్రి గల్లా అరుణ కుమారి తన కుమారుడు జయదేవ్కు ఆ సీటు కావాలని అడిగారు. ఆమెను కాదని మరొకరికి కాంగ్రెసు నాయకత్వం టికెట్ ఇచ్చింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వల్లనే టికెట్ గల్లా జయదేవ్కు కాకుండా వెంకటరమణకు దక్కింది.
తిరుపతి నుంచి గతంలో పోటీ చేసిన ముగ్గురిలో భూమన కరుణాకర్ రెడ్డి ఒకరు. ఆ ఎన్నికల్లో చిరంజీవి విజయం సాధించారు. అప్పుడు పోటీ చేసిన చిరంజీవి, శంకర్ రెడ్డి కూడా ఈ ఉప ఎన్నికలో కాంగ్రెసు వైపు ఉన్నారు. అయినా, 2009లో చిరంజీవికి వచ్చిన మెజారిటీ కన్నా ఈసారి కరుణాకర్ రెడ్డికి ఎక్కువ మెజారిటీ వచ్చింది. దీంతో చిరంజీవి చరిష్మా గానీ, కిరణ్ నాయకత్వం గానీ ఇక్కడ ఏమాత్రం పని చేయలేదని అంటున్నారు. వాస్తవానికి, కరుణాకర్రెడ్డి అభ్యర్థిత్వంపై ఆయన పార్టీలోనే అంతర్మథనం జరిగింది. ఆయన పట్ల స్థానికుల్లో కొంత వ్యతిరేకత కూడా ఉంది.
కరుణాకర్ రెడ్డి పార్టీని వీడినా చిరంజీవి, శంకర్రెడ్డి చేరికతో కాంగ్రెస్ బలం పుంజుకుంటుందని అనుకున్నారు. కానీ, ఫలితం మాత్రం షాక్ ఇచ్చింది. ఇక, తిరుపతి నియోజకవర్గంలో బలిజ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువ. అయితే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల అభ్యర్థులు వెంకటరమణ, చదలవాడ కృష్ణమూర్తి ఇద్దరూ అదే సామాజికవర్గానికి చెందినవారు. దీంతో, ఓట్లలో గణనీయంగా చీలిక వచ్చింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి గెలుపునకు ఇదీ ఒక కారణంగా చెబుతున్నారు. జగన్ అరెస్ట్కు ముందు రెడ్డి సామాజికవర్గంలో మాత్రమే ఆ పార్టీకి గట్టి పట్టు కనిపించగా, అరెస్ట్ తర్వాత అన్ని వర్గాల్లోనూ ఆ పార్టీకి సానుభూతి లభించింది.
కాంగ్రెస్, తెలుగుదేసం అభ్యర్థులు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో చిరంజీవి తమకు ప్లస్ పాయింట్ అవుతారని, తెలుగుదేశం పూర్తిగా దెబ్బతింటే ఆ మేరకు కాంగ్రెస్ లాభపడుతుందని లెక్కలు వేశారు. కానీ అవేమి పనిచేయలేదు. ఇక, ఉప ఎన్నికల ఫలితాల్లో వైయస్ సానుభూతి పనిచేసినట్టే తిరుపతిలోనూ పని చేసిందని అనుకోవడానికీ వీల్లేని పరిస్థితి. మిగతా అన్ని నియోజక వర్గాల్లో సగటున 80 శాతం ఓట్లు పోలవగా, ఇక్కడ మాత్రం కనిష్ఠ స్థాయిలో 55 శాతం ఓట్లు పోలయ్యాయి.
చిరంజీవి కాంగ్రెస్లో విలీనమైన నేపథ్యంలో ఇక్కడ గెలుపు నల్లేరుపై బండి నడక అవుతుందని అంచనా వేశారు. ఎన్నికల ముందు సీఎం తిరుపతికి చాలా వరాలు ప్రకటించారు. వెంకటరమణకు నగర ప్రజలతో ఉన్న సత్సంబంధాలకు తోడు ఆయన సామాజికవర్గ బలం కూడా తోడైతే విజయం సాధ్యమేనని భావించారు. ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకర్షించడానికి తన తమ్ముడిని ముఖ్యమంత్రి రంగంలోకి దింపారు. అయినా, వైయస్సార్ గెలుపును అడ్డుకోలేకపోయారు.