కాంగ్రెసుకు చిరంజీవి ఎప్పటికీ కుంపటేనా?
కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసినప్పటికీ వేరే పార్టీ నాయకుల మాదిరిగా షరతులు పెడుతూ, బేరసారాలు ఆడుతూ ప్రత్యేకతను పాటిస్తున్నారు. ఈ వ్యవహారం చూస్తుంటే, చిరంజీవి, ఆయన పార్టీ నాయకులు కాంగ్రెసులో చేరారా, వేరే పార్టీగా ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక రకంగా, అధికారంగా చిరంజీవి కాంగ్రెసు పార్టీలో ఓ ప్రత్యేకమైన వర్గాన్ని నిర్వహిస్తూ, ఒత్తిడి రాజకీయాలకు పాల్పడుతూ ముందుకు సాగుతున్నారు. తన వెంట ఉంటే పదవులు, ప్రయోజనాలు సమకూరుతాయనే సంకేతాలను తన ఒత్తిడి రాజకీయాల ద్వారా పంపుతున్నారు. దీనివల్ల కాంగ్రెసుకు కట్టుబడి దశాబ్దాలుగా పనిచేస్తున్న నాయకులు ఏ విధమైన వైఖరి తీసుకుంటారనేది తెలియకుండా ఉంది.
చిరంజీవి రాజకీయాల తీరు పట్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంతృప్తిగా లేరని భావిస్తున్నారు. వారు కాంగ్రెసు పార్టీకి చెందినవారిగా వ్యవహరించడం లేదని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని ఆయన పార్టీ అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం. అయినా, అధిష్టానం చిరంజీవి మాటకే విలువ ఇస్తోంది తప్ప ప్రభుత్వాన్ని నడుపుతున్న తన మాట వినడం లేదనే అభిప్రాయంతో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు. 2014 ఎన్నికల సమయంలో చిరంజీవి వర్గం టికెట్ల కోసం ఏ విధమైన బేరసారాలకు దిగుతుంది, అది పార్టీపై ఏ విధమైన ప్రభావం చూపుతుందీ అనేది సందేహంగానే ఉంది.