హరికృష్ణ, బాలకృష్ణ: ఎవరికి వారే

హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఇతర కుటుంబ సభ్యులు ఒక విడత ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించడానికి వచ్చారు. బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి విడిగా వచ్చారు. తాను పార్టీ విజయానికి కృషి చేస్తానని బాలకృష్ణ చెప్పారు. ప్రస్తుతం రాజకీయాలు భ్రష్టు పట్టాయని, ఇప్పుడు ఎన్టీ రామారావు వంటి నాయకుడి అవసరం ఉందని హరికృష్ణ చెప్పారు. బాలకృష్ణ మాత్రం - చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు వారసత్వాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ రకంగా ఇద్దరు సోదరులు భిన్నమైన ప్రకటనలు చేశారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, పార్టీ సీనియర్ నాయకుడు దేవేందర్ గౌడ్ తదితరులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్కు వచ్చారు. తొలుత రసూల్పురా క్రాస్ రోడ్స్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత బసవతారకం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ వద్ద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వికలాంగులకు ఆయన ట్రైసైకిల్స్ పంపిణీ చేశారు. భవిష్యత్తు తరాలకు ఎన్టీ రామారావు ఆదర్సమని ఆయన అన్నారు.
హరికృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్, జయకృష్ణ, కళ్యాణ్ రామ్, రామకృష్ణ విడిగా ఎన్టీఆర్ ఘాట్కు వచ్చారు. కాంగ్రెసును ఎదుర్కున్న నాయకుడు ఎన్టీ రామారావు మాత్రమేనని, బోఫోర్స్ కుంభకోణాన్ని వెలికి తీసింది ఎన్టీ రామారావేనని, విపి సింగ్ ప్రభుత్వాన్ని తెచ్చింది కూడా ఎన్టీ రామారావేనని హరికృష్ణ అన్నారు. జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ పాత్రను చంద్రబాబు నాయుడు సొంత చేసుకోవడాన్ని హరికృష్ణ వ్యతిరేకిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఎన్టీఆర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ వద్ద బాలకృష్ణ తన తండ్రి ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించారు. ఎన్టీ రామారావు వంటి నాయకుడు కావాలని హరికృష్ణ చేసిన వ్యాఖ్యను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా - అవును, మనకు ఉన్నారు. బావగారు ( చంద్రబాబు నాయుడు) ఉన్నారు... ఇతర నాయకులు, పార్టీ శ్రేణులు ఉన్నాయి అని బాలకృష్ణ అన్నారు. వీరి మాటలను బట్టి లోలోన విభేదాలు కొనసాగుతున్నట్లు అర్థమవుతోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications