కెసిఆర్పై ఫైట్: బాబుకు జగన్ సాక్షి కవరేజీ

చంద్రబాబు నాయుడు వస్తున్నా.. మీకోసం పేరుతో చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో సాగుతోంది. తెరాసకు ఎక్కువగా పట్టున్న జిల్లాల్లో ఇదొకటి. తెలంగాణలో ప్రవేశించినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు కెసిఆర్పై, ఆయన పార్టీపై తెగ వ్యాఖ్యలు చేస్తున్నారు. వ్యంగ్యాస్త్రాలు కూడా విసురుతున్నారు. తాను తెలంగాణకు వ్యతిరేకం కాదంటూనే కెసిఆర్పై విమర్శల జడివాన కురిపిస్తున్నారు.
కెసిఆర్పై, తెరాసపై చంద్రబాబు చేస్తున్న విమర్శలకు సాక్షి మీడియా ప్రాధాన్యం ఇస్తూ ప్రచురిస్తోంది. చంద్రబాబు, జగన్ ఉమ్మడి శత్రువు కూడా తెలంగాణలో కెసిఆర్ కావడం వల్లనే సాక్షి మీడియా ఆ విధంగా చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. తెరాసను తిరకాసు పార్టీగా చంద్రబాబు అభివర్ణిస్తున్నారు. కెసిఆర్ తెలంగాణ కోసం చేసేందేమీ లేదని అంటున్నారు. కెసిఆర్కు తెలంగాణ రావాలని కూడా లేదని ఆయన అంటున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలకు సాక్షి మీడియా ప్రాధాన్యం ఇస్తూ ప్రచురిస్తోంది.
అదే సమయంలో చంద్రబాబు వైయస్ జగన్పై, ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీనే కాకుండా వైయస్ రాజశేఖర రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. వైయస్ జగన్ ఆస్తుల పోగుపై చంద్రబాబు పదే పదే ఓ పిట్ట కథ చెబుతున్నారు. జగన్ సంపాదించిన డబ్బులు కట్టలు కడితే ఎన్ని లారీలు అవుతాయో ఆయన చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలకు మాత్రం సాక్షి మీడియా కోత పెడుతోంది.
తెలంగాణలో ప్రవేశించిన వైయస్ జగన్ సోదరి షర్మిల మొదట్లో కెసిఆర్పై దూకుడుగా వ్యాఖ్యలు చేశారు. అవతలి నుంచి తీవ్రమైన ఎదురు దాడి ప్రారంభమైంది. దీంతో ఆమె కాస్తా వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నారు. షర్మిల మాత్రం చంద్రబాబునే ప్రధాన లక్ష్యం చేసుకుని విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఏమైనా, రాజకీయాలనే కాకుండా ప్రజలను కూడా అయోమయంలో పడేయడానికి రాజకీయ పార్టీలు చేయాల్సినంత పని చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications