కెసిఆర్ ఢిల్లీ యాత్ర, తెలంగాణపై హాట్
ఢిల్లీలో ఆయన అధికార కాంగ్రెసు పార్టీకి చెందిన ముఖ్య నాయకులతో కెసిఆర్ సమావేశమవుతారని అంటున్నారు. మూడు రోజుల పాటు ఆ భేటీలు సాగుతాయని సమాచారం. తెలంగాణపై కాంగ్రెసు వైఖరిని తెలుసుకోవడంతో పాటు తెలంగాణకు అనుకూలంగా ప్రకటన వెలువరించకపోతే తాము చేయబోయే ఆందోళనకు సంబంధించిన వివరాలను ఆయన కాంగ్రెసు పెద్దలకు వివరిస్తారని చెబుతున్నారు.
తెలంగాణ ఏర్పాటుపై తమకు పక్కా సమాచారం ఉందని, దాంతోనే తాము ఆగస్టులో జరగాల్సిన పార్టీ సమావేశాలను వాయిదా వేశామని, ఈ నెల 17వ తేదీలోగా కీలకమైన ప్రకటన వెలువడుతుందని తెరాస వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ తెలంగాణకు అనుకూలంగా కేంద్రం ప్రకటన చేయడానికి ముందుకు రాకపోతే ఈ నెల 17వ తేదీన భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణపై ఈ నెల 17వ తేదీన కెసిఆర్ ప్రకటన చేస్తారని అంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో పర్యటించి కాంగ్రెసు మోసాన్ని ప్రజలకు వివరిస్తారని వారంటున్నారు.
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందుకు వస్తే తెరాసను కాంగ్రెసులో విలీనం చేసే ప్రతిపాదన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఇస్తే కాంగ్రెసులో తెరాసను విలీనం చేసే ఆలోచన కూడా ఉంటుందని తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు ఇటీవల చెప్పారు. తమకు కావాల్సింది తెలంగాణ అనే ఉద్దేశ్యాన్ని తెరాస స్పష్టంగా కాంగ్రెసు ముందు పెడుతున్నట్లు సమాచారం.