జగన్కు కౌంటర్: చిరు, కెసిఆర్ తురుపుముక్కలు
తెలంగాణ అంశంపై నిర్ణయం తీసుకుని, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును తమ పార్టీ పరిధిలోకి తెచ్చుకుంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీని తెలంగాణ ప్రాంతంలో ఎదుర్కోవడం సులభమవుతుందని సోనియా గాంధీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే కెసిఆర్తో కాంగ్రెసు అధిష్టానం పెద్దలు కెసిఆర్తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి చెందిన కాంగ్రెసు నాయకులు కెసిఆర్ ఢిల్లీ యాత్ర విషయంలో ఎన్ని విధాలుగా మాట్లాడినప్పటికీ అధిష్టానం మాత్రం ఆయన వ్యూహరచనకు, ఆయన ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెబుతున్నారు.
సోనియా గాంధీ కెసిఆర్తో చర్చలు జరిపి ఒక నిర్ణయానికి రావడానికే ప్రాధాన్యం ఇచ్చినట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి కాంగ్రెసు పార్టీ అంగీకరిస్తే తన పార్టీని విలీనం చేయడానికి కూడా కెసిఆర్ సిద్ధంగానే ఉన్నట్లు చెబుతున్నారు. దానివల్ల తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెసుకు పూర్తిగా కొత్త రూపం వస్తుంది. సీనియర్ నాయకులు డి. శ్రీనివాస్, వి హనుమంతరావు వంటి నాయకుల సహకారంతో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక సీట్లు సాధించి పెట్టే బాధ్యతను కెసిఆర్కు అప్పగించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
ఇకపోతే, సీమాంధ్రలో చిరంజీవి నాయకత్వంలో పార్టీని ముందుకు నడిపించాలనే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, తదితరులను కేంద్ర స్థాయిలోకి తెచ్చేసి చిరంజీవికి సీమాంధ్ర నాయకత్వ బాధ్యతలను అప్పగించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇటీవలి ఉప ఎన్నికల్లో కాంగ్రెసు గెలిచిన రెండు సీట్లను కూడా అధిష్టానం చిరంజీవి ఖాతాలో వేసినట్లు చెబుతున్నారు. ఆ రెండు సీట్లలో విజయం సాధించడానికి అనుసరించిన ఎత్తుగడలను సీమాంధ్రలో అనుసరించి పార్టీని ముందుకు నడిపించాలనే యోచనలో అధిష్ఠానం ఉన్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ సభ్యులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, ఆనంద భాస్కర్ చెప్పిన విషయాల మీద సోనియా గాంధీ ఎక్కువగా ఆధారపడుతున్నట్లు సమాచారం. వీరిద్దరు కూడా తెలంగాణకు అనుకూలంగా అధిష్టానం నుంచి నిర్ణయం వెలువడుతుందని గట్టిగానే చెబుతున్నారు. ఆనంద భాస్కర్ నివేదికలపై సోనియా గాంధీకి ఎక్కువగా విశ్వాసమని అంటున్నారు. అందుకే రాజ్యసభలో తెలంగాణపై మాట్లాడే అవకాశం ఆయనకు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఏమైనా, వైయస్ జగన్ను ఎదుర్కునే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ లోకసభ స్థానాలు రాబట్టడానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెసు అధిష్టానం ముందుకు వస్తున్నట్లు చెబుతున్నారు.