కెమెరామేన్ గంగతో రాంబాబు: టార్గెట్ తెలంగాణ
ప్రతిపక్ష నేతను, ఆయన కుమారుడిని దుష్టపాత్రల్లో చూపించి తెలంగాణ ఉద్యమాన్ని టార్గెట్ చేసుకున్నారని అంటున్నారు. ఓ బడా రాజకీయ నాయకుడు సృష్టించే ఎ పెద్ద సమస్య నుంచి రాష్ట్రాన్ని మీడియా ప్రతినిధి కాపాడడం ఇతివృత్తమని చెప్పిన పూరీ జగన్నాథ్ ప్రతిపక్ష నాయకుడి కుమారుడు ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడమే సమస్యకు పరిష్కారంగా చూపించారు. వాస్తవికత లోపించిన చిత్రంగానే కాకుండా సమస్య చిత్రీకరణలో దృక్పథరాహిత్యం స్పష్టంగా సినిమాలో కనిపిస్తుంది.
పాత్రలను, సమకాలీన రాజకీయ పరిణామాలను కలగాపులగం చేయడం ద్వారా తెలంగాణ వ్యతిరేకతను ప్రదర్శిస్తే వివాదానికి దూరంగా ఉండవచ్చునని పూరీ జగన్నాథ్ భావించి ఉంటాడని అంటున్నారు. రాష్ట్రాన్ని పీడించే పెద్ద సమస్య ఓ పార్టీ నాయకుడు తెలుగుతల్లి పార్టీని స్థాపించడంగానే చూపించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర రెడ్డి జనరంజకంగా పాలిస్తున్న తరుణంలో ఆయనను దింపి తన కుమారుడు రానాబాబును ముఖ్యమంత్రిని చేయాలని ప్రతిపక్ష నేత జవహర్ నాయుడు ప్రయత్నిస్తుంటాడు. ఇందులో చంద్రశేఖర రెడ్డిని వైయస్ రాజశేఖర రెడ్డికి, జవహర్ నాయుడిని చంద్రబాబుకుఅన్వయించుకుంటున్నారు. రాష్ట్ర రాజకీయాలకు వచ్చేసరికి ఇదే వరుస అనిపిస్తూ ఉంటుంది.
కానీ, తెలుగుతల్లి పార్టీని తెలంగాణ రాష్ట్ర సాధనకు ఏర్పడిన రాజకీయ పార్టీగా, జవహర్ నాయుడిని ఆ పార్టీ నేతగా తీసుకోవడానికి వీలుగా సినిమాలో సంభాషణలను, ఇతివృత్తాన్ని ప్రదర్సించారు. రానాబాబు (ప్రకాష్ రాజ్) తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు అన్వయిస్తూ కథను నడిపించాడు. రానాబాబు తన రాీజకీయ ప్రస్థానం కోసం తెలుగుతల్లి ఉద్యమ పార్టీని స్థాపిస్తాడు. తన రాష్ట్రంలో తెలుగు ప్రజలు తప్ప మరాఠీ, బెంగాలీ, మలయాళీలు ఎవరూ ఉండకూడదని, వారు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను బహిష్కరించాలని ప్రసంగాలు చేస్తుంటాడతను.
తెలంగాణ ఉద్యమాన్ని నేరుగా ప్రస్తావించే సాహసం చేయలేక తెలుగు తల్లి పారటీ, తెలుగు ఉద్యమం అంటూ సృష్టించారని అంటున్నారు. ఇందులో ప్రకాష్ రాజ్ను ఉద్దేశించి హీరో రాంబాబు (పవన్ కళ్యాణ్) ప్రశ్నిస్తూ ఇలా డైలాగులు చెప్పించారు - 'పక్క రాష్టాల తల్లులంటే నీ తల్లికి పడదు. అలాంటి నీకు జాతీయ గీతం పాడే హక్కు ఎక్కడి', 'నిన్ను, నీ బాబుని ఢిల్లీ గెస్ట్ హౌస్ నుంచి తీసుకొచ్చి బట్టలూడదీసి కొడితే ఎలా ఉంటుందో రాష్ట్రం అలా ఉందిరా'. ఈ డైలాగులు తెలంగాణ ఉద్యమంపై విషం చిమ్మేవేనని తెలంగాణవాదులు మండిపడుతున్నారు.
కొసమెరుపు ఏమిటంటే - వీర తెలంగాణ, పోరు తెలంగాణ చిత్రాల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని వెండితెరపై చూపించిన దర్శకుడు ఆర్ నారాయణమూర్తికి ఈ సినిమాను అంకితం చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని బలపరుస్తున్న నారాయణమూర్తికి సినిమాను అంకితం ఇవ్వడం ద్వారా తాను సినిమాలో ఉద్దేశించింది తెలంగాణ ఉద్యమాన్ని అని పూరీ జగన్నాథ్ చాటుకున్నారని అంటున్నారు.