బాబు టార్గెట్: షర్మిల 2500కిమీ యాత్ర, జగన్ ఓకే
రాష్ట్ర రాజకీయ పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకోవాలంటే వైయస్ కూతురు, జగన్ సోదరి అయిన షర్మిలతో సుదీర్ఘ పాదయాత్ర చేయించడం మినహా మరో మార్గం లేదని పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో.. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, పార్టీ విప్ బాలినేని శ్రీనివాస రెడ్డి తదితరులు చంచల్ గూడ జైల్లో ఉన్న జగన్ను కలిసి చర్చించారు. షర్మిల పాదయాత్రకు జగన్ కూడా ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక అధికారిక ప్రకటనే తరువాయని పార్టీ వర్గాలు తెలిపాయి.
పార్టీ కేంద్ర పాలకమండలిలో చర్చించిన తర్వాత ఈ అంశాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. వాస్తవానికి సోమవారమే ఈ సమావేశం జరగాల్సి ఉన్నా.. అది బుధవారానికి వాయిదా పడింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం దాదాపు 2,500 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర కొనసాగబోతోంది. జగన్కు బెయిల్ వస్తుందని గంపెడాశతో ఉన్న పార్టీ శ్రేణులు.. సుప్రీం తాజా తీర్పుతో డీలా పడ్డాయి. మరోవైపు టిడిపి అధినేత చంద్రబాబు ఇప్పటికే పాదయాత్రతో జనంలోకి వెళ్లిపోవడంతో దీనికి కౌంటర్గా పాదయాత్ర చేయడం తప్పనిసరని ఆ పార్టీ వర్గాలు భావించాయి.
ఒకానొక దశలో జగన్ తల్లి విజయమ్మ, భార్య భారతీ రెడ్డి, సోదరి షర్మిల.. ఈ ముగ్గురితో పాదయాత్ర చేయించి పార్టీ శ్రేణులను ఉత్తేజపరచాలని పార్టీ వర్గాలు భావించాయి. కానీ, వయోభారం వల్ల విజయమ్మ అంత దూరం నడవడం సాధ్యం కాదని ఆమెను, జగన్ వ్యాపార లావాదేవీలన్నింటినీ భారతీ రెడ్డే చూసుకుంటున్నారు. కాబట్టి ఆమెను కూడా మినహాయించారు. దీంతో షర్మిలతో పాదయాత్రను చేయించాలని మధ్యలో అక్కడక్కడ విజయమ్మ, భారతి ఈ యాత్రలో పాల్గొనాలని తీర్మానించారు. యాత్ర ప్రారంభం, రూటు మ్యాప్ వంటి విషయాలను బుధవారం తర్వాత నిర్ణయిస్తారని తెలిసింది.