సిఎం మార్పు: కొడుకు ద్వారా మర్రి లాబీయింగ్?
ఇందులో భాగంగా జితేంద్ర దేశ్ముఖ్ ఇటీవల రాష్ట్రానికి వచ్చారు. ఆయన వైజాగ్లో అభిప్రాయాలు సేకరిస్తున్న సమయంలో మర్రి తనయుడు ఆదిత్య ప్రత్యక్షమయ్యారట. తన తండ్రి కోసం లాబియింగ్ చేసేందుకు దీనిని వేదికగా చేసుకునే ప్రయత్నాలు చేశారని అంటున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి మార్పు అంశానికి తెరపడినట్లే కనిపిస్తోంది. కానీ కాంగ్రెసు వర్గాల్లో మాత్రం ఆ అంశానికి తెరపడలేదని తెలుస్తోంది.
కిరణ్ కుమార్ రెడ్డిని మార్చి అదే సామాజిక వర్గానికి చెందిన తెలంగాణ ప్రాంత నేతను ముఖ్యమంత్రిగా చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర మంత్రులు జానా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శశిధర్ రెడ్డిల పేర్లను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు ఏ సమయంలోనైనా వచ్చే అవకాశాలు ఉండటంతో సాధ్యమైనంత తొందరగా మార్చాలనే ఆలోచనలో ఉన్నారట. మాజీ పిసిసి చీఫ్ డి శ్రీనివాస్ కూడా సిఎం పదవి రేసులో ఉన్నారు.
మార్పు గురించి ఊహాగానాలు చెలరేగుతున్న సమయంలో ఆదిత్య రెడ్డి... రాహుల్ గాంధీ దూతగా వచ్చిన జితేంద్రతో కలవడం చర్చనీయాంశమైంది. గాంధీ దూతను ఇన్ఫ్లుయెన్స్ చేసేందుకే ఆదిత్య వచ్చి ఉంటాడని, కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా ఫీడ్ బ్యాక్ ఇచ్చి ఉంటారని ముఖ్యమంత్రి వర్గం భావిస్తోందట కూడా. మర్రి శశిధర్ రెడ్డి కూడా ఢిల్లీలో తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు తనయుడిని కూడా రంగంలోకి దింపారని అంటున్నారు.
తెలంగాణ సెగ రాజుకున్న ఇలాంటి సమయంలో తెలంగాణకు చెందిన నేతకు ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తే పలువురు అధిష్టానం చెవుల్లో ఊదుతున్నారట. మర్రి లాంటి వ్యక్తి సమర్థుడు అని పలువురు భావిస్తున్నారట. ఆదిత్య రెడ్డి వైజాగ్ రావడం, జితేంద్రను కలవడం... దీనిపై కిరణ్ వర్గం ఆరా తీస్తోందని అంటున్నారు. అయితే కాంగ్రెసులో ఇది సాధారణమేనని, ఎవరికి వారు తన పని తీరును చూపించే ప్రయత్నాలు చేస్తుంటారని, అలాగే ఇతరుల పనిని తక్కువ చూపించే ప్రయత్నాలు చేస్తుంటారని అంటున్నారు.