'తెలంగాణ పోరు': కొండా సురేఖకు లాభమా?
ఆమెకు మద్దతిచ్చేది లేదని పోటీలో తమ అభ్యర్థిని నిలబెడతామని ప్రకటించాయి. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, సిపిఐ అందరూ కలిసి ఉమ్మడిగా ఓ అభ్యర్థిని నిలబెడితే ఆమె ఓటమి ఖాయమని భావిస్తూ వచ్చారు. కానీ తాజాగా ఆ మూడు పార్టీలు వేర్వేరుగా బరిలో నిలిచేందుకు సన్నద్దమవుతున్నాయి. దీంతో ఆమె గెలుపు నల్లేరు మీద బండిలా సాగుతుందని అభిప్రాయపడుతున్నారు.
మహబూబ్నగర్ నియోజకవర్గం విజయంతో అందరికంటే ముందే బిజెపి పరకాలలో పోటీ చేస్తామని ప్రకటించింది. అప్పటికే బిజెపి చేతిలో చావు దెబ్బ తిన్న తెరాస పరకాలలో పోటీపై సందిగ్ధంలో పడింది. ఒకవేళ పరకాలలో పోటీ చేస్తే ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. దీంతో పోటీ చేసి ఖచ్చితంగా గెలిపించుకోవాలని లేదా బిజెపికి మద్దతిచ్చే అంశంపై ఆలోచించాయట.
తీవ్ర తర్జన భర్జన అనంతరం తెరాస పోటీకి సిద్ధపడింది. ఇక్కడ కాంగ్రెసుతో పాటు తెలంగాణవాద బిజెపిని ఓడించేందుకు తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెరాస నేతలు వ్యూహరచన చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో సిపిఐ పార్టీ తెరాసకు మద్దతిచ్చింది. ఇప్పుడు కూడా ఆ పార్టీ మద్దతిస్తుందని తెరాస భావించింది.
అయితే అనూహ్యంగా ఆ పార్టీ కూడా రంగంలోకి దిగేందుకు సన్నద్దమవుతోంది. పరకాల నియోజకవర్గం తెలంగాణ కోసం రాజీనామా చేసిన స్థానం కాదు కాబట్టి తాము బరిలో ఉండే విషయమై ఆలోచిస్తున్నామని చెప్పింది. దీంతో తెరాస నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. ఇటీవలి ఉప ఎన్నికల్లో తమకు మద్దతిచ్చిన సిపిఐకి మద్దతివ్వాలా లేక పోటీ చేయాలా అనే విషయమై తాజాగా తిరిగి తర్జన భర్జన పడుతున్నదని అంటున్నారు.
తెలంగాణవాదం గట్టిగా వినిపిస్తున్న ఈ మూడు పార్టీలు కనుక రంగంలోకి దిగితే ఓట్లు చీలిపోయి అది కొండా సురేఖకే లాభిస్తుందని అంటున్నారు. ఓట్ల చీలిక వల్ల సురేఖ గెలుపు ఖాయమని చెబుతున్నారు. అయితే ఏ పార్టీయో విరమించుకొని మరో పార్టీకి మద్దతిచ్చిన పక్షంలో మాత్రం ఫలితాలు తారుమారు అయ్యే అవకాశముందంటున్నారు.