జైల్లో జగన్: పార్టీని నిలబెట్టగలరా?

పార్టీకి అత్యంత ముఖ్యనాయకుడిగా భావిస్తున్న మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ రామచంద్రాపురం నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. వైయస్ జగన్ అరెస్టు వల్ల, వైయస్ విజయమ్మ, షర్మిల ప్రచారం వల్ల వెల్లువెత్తిన సానుభూతి ఓట్లతో మాత్రమే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుందనే వాదన వినిపిస్తోంది. సాధారణ ఎన్నికల నాటికి ఆ సానుభూతి ఉండదని, అన్ని పార్టీల మాదిరిగానే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిలబడాల్సి వస్తుందని, అప్పుడు విజయం సాధించడం అంత సులభం కాదని అంటున్నారు.
వైయస్ జగన్ ఇప్పట్లో జైలు నుంచి బయటపడే అవకాశాలు లేవు. పైగా, అవినీతి చర్యలు జగన్పై మరింత వ్యతిరేక భావనను ప్రజల్లో నింపుతాయని అంటున్నారు. తాము కలిసికట్టుగా పనిచేస్తే, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే తగిన ఫలితాలు సాధించగలమని కాంగ్రెసు పార్టీ రుజువు చేసుకున్నట్లయింది. తెలుగుదేశం పార్టీ సీట్లు గెలవకపోయినా మాచర్ల, ప్రత్తిపాడు, ఒంగోలు వంటి స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చింది. ఈ స్థితిలో బలమైన నిర్మాణం, కార్యకర్తల బలం ఉన్న కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు నిలబడి, సానుభూతి మీద మాత్రమే కొట్టుకొచ్చిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ క్రమంగా బలాన్ని కోల్పోతుందని అంటున్నారు.
ఉప ఎన్నికల ఫలితాల తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నుంచి వలసలు అంతగా ఉండే అవకాశం లేదు. విజయం సాధించిన అభ్యర్థులు తిరుగులేని మెజారిటీ సాధించి, తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి ఉంటే మాత్రమే వలసలు ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అత్యధిక స్థానాలు గెలిచినా పోటీ ఏకపక్షం కాదనే విషయాన్ని ఉప ఎన్నికలు నిరూపించాయి.
వైయస్ జగన్ ఆరెస్టయిన తర్వాత ఇద్దరు శానససభ్యులు కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెసులోకి వచ్చారు. ఇక అంతకు మించి వలసలు ఉండకపోవచ్చునని అంటున్నారు. వైయస్ విజయమ్మ గానీ, పార్టీలోకి కొత్తగా వచ్చిన మైసురా రెడ్డి గానీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీని నిర్మాణాత్మకంగా ముందుకు నడిపించగలరా అనేది ప్రశ్న. అలా లేనప్పుడు వైయస్సార్ కాంగ్రెసు భవిష్యత్తు తిరుగులేని విధంగా ఉండే అవకాశాలు తక్కువేనని చెప్పాలి.












Click it and Unblock the Notifications