నాయకత్వ మార్పు: జగన్ ఎఫెక్ట్ తగ్గించేదెవరు?
ముఖ్యమంత్రి మార్పు తథ్యమని కాంగ్రెసులో ఓ వర్గం తీవ్రంగానే ప్రచారం చేస్తోంది. ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేసేవారు చేస్తున్నారు. అయితే, మార్పు చేస్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభావాన్ని ఏమైనా తగ్గించగలమా అనేదే ఇప్పుడు కాంగ్రెసు అధిష్టానాన్ని పీడిస్తున్న సంశయం. అలా తగ్గించలేనప్పుడు ముఖ్యమంత్రిని మార్చాల్సిన అవసరం లేదనే అభిప్రాయంతో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, తెలంగాణ రెడ్లకు నాయకత్వాన్ని ఇస్తే, మార్పు ఉంటుందనే అభిప్రాయం ఒక వర్గం నుంచి బలంగా వినిపిస్తోంది.
ఈ స్థితిలోనే పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. జానా రెడ్డి తీవ్రంగా ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. ఆయన జైపాల్ రెడ్డి అండదండలున్నాయి. జానా రెడ్డి పేరును ఆయన ముందు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే కిరణ్ కుమార్ రెడ్డి జైపాల్ రెడ్డితో సమరానికి సై అన్నారని అంటున్నారు. గ్యాస్ కేటాయింపుల పేరుతో ఆయన జైపాల్ రెడ్డిని ఎదుర్కోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, జానా రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమిస్తే పునాది స్థాయిలో పార్టీని బలోపేతం చేయగలమా అనే సందేహం కాంగ్రెసు అధిష్టానంలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలావుంటే, మర్రి చెన్నారెడ్డి తనయుడు, హైదరాబాదులోని సనత్నగర్ శాసనసభ్యుడు మర్రి శశిధర్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. మర్రి శశిధర్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నందున సీమాంధ్రుల మద్దతు కూడా లభిస్తుందనే ప్రచారం సాగుతోంది. మర్రి శశిధర్ రెడ్డికి మంచి పలుకుబడి ఉందని అంటున్నారు. అయితే, కార్యకర్తల్లోకి చొచ్చుకుని పోగలరా అనేది అనుమానంగా ఉంది.
కాగా, గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి కన్నా లక్ష్మినారాయణ కూడా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. కన్నా లక్ష్మినారాయణకు కాపు సామాజిక వర్గంలో మంచి పలుకుబడి ఉంది. దాంతో ఆయన పేరును కొంత మంది ప్రస్తావిస్తున్నారు. అయితే, అప్పుడు చిరంజీవి గానీ బొత్స సత్యనారాయణ గానీ పోటీకి రావచ్చునని అంటున్నారు. త్వరలో కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ కూడా మారవచ్చునని అంటున్నారు. గులాం నబీ ఆజాద్ స్థానంలో వాయలార్ రవి వస్తారని, ఆయన వచ్చిన తర్వాతనే ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.