ఆత్మరక్షణలో జగన్ పార్టీ: అందుకే బాబుపై...

కాంగ్రెసుతో తమ పార్టీ విలీనాన్ని తోసిపుచ్చలేమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ అన్నట్లు వార్తలు రావడంతో ఒక్కసారిగా కలకలం పుట్టింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లో విలీనం అయిపోతుందని, ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందని కథనాలు వస్తున్నాయి, దీనికి మీరేమంటారని ఓ వార్తా సంస్థ అడిగిన ప్రశ్నలకు భవిష్యత్తు మాత్రమే దాన్ని నిర్ణయిస్తుందని ఆమె జవాబిచ్చారు. పీటీఐ విలేకరి అడిగిన ప్రశ్నకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి నర్మగర్భంగా ఇచ్చిన జవాబుగా దాన్ని స్వీకరించారు.
విలీనం లేదా పొత్తు ఉండదని ఆమె తేల్చి చెప్పలేదు. అదే సమయంలో, మతతత్వ పార్టీ (బీజేపీ)తో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని గతంలో జగన్ తేల్చిచెప్పారని గుర్తుచేశారు. కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని, కేసుల నుంచి జగన్ బయటకు రాగానే ఆ రెండు పార్టీలూ విలీనమవుతాయని తెలుగుగుదేశం విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వైయస్ విజయమ్మ పిటిఐ ఇంటర్వ్యూ కలకలం సృష్టించింది.
విజయలక్ష్మి నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ విమర్శలకు బలం చేకూరుస్తున్నాయని పీటీఐ వ్యాఖ్యానించింది. దీంతో, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వెంటనే స్పందించింది. విజయలక్ష్మి పేరిట ఓ ప్రకటనను విడుదల చేసింది. "కాంగ్రెస్తో విలీనాన్ని వైసీపీ ఖండిస్తోంది'' అని ప్రకటించింది. పీటీఐ వార్తా కథనాన్ని అత్యంత హేయమైన చర్యని అభివర్ణించింది. కుట్రపూరితంగా కథనం ఎందుకు ఇచ్చిందో పీటీఐ సమీక్షించుకోవాలని కోరింది. పిటిఐ వార్తాకథనాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తిప్పికొడుతూనే ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్తో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రహస్య మంతనాలు జరిపారని ఎదురుదాడికి దిగారు.
ప్రధాని మన్మోహన్ సింగ్తో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రహస్యంగా ఏం మాట్లాడారో స్పష్టం చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార పార్టీ ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. ప్రధానిని ఏకాంతంగా కలవడం వెనుక అంతర్యం ఏమిటో బాబు బయటపెట్టాలని ఆమె అన్నారు. చంద్రబాబుకు రహస్యంగా చర్చలు జరపడం మొదటి నుంచి అలవాటేనని ఆమె సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
ఢిల్లీలో చంద్రబాబును కాంగ్రెస్ ఎంపీలు కలిసింది వాస్తవం కాదా అని పద్మ ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ను ఎదిరించాలంటే కాంగ్రెస్-టీడీపీలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకోలేదా అని ఆమె అన్నారు. మీడియాను అడ్డంపెట్టుకుని కుళ్లురాజకీయాలు చేసేది తెలుగుదేశం పార్టీ నేతలేనని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు తమ నేతపై వచ్చిన విమర్శలను ఖండించుకోవాల్సిన స్థితిలో పడ్డారు. అయితే, పరస్పర విమర్శల విషయంలో మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గేట్లు కనిపించడం లేదు. పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు కాంగ్రెస్తో కుమ్మక్కవుతున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications