అంతా రెడీ: ఎన్నికలకు ముందే రెండు రాష్ట్రాలు?
90 రోజుల్లోనే అవసరమైన రాజకీయ, రాజ్యాంగ ప్రక్రియను పూర్తి చేసేందుకు కార్యాచరణ జరుగుతోంది. కొన్ని నెలల క్రితం ఆంటోనీ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఒకటి రాష్ట్ర విభజనకు సంబంధించిన ప్రాథమిక కసరత్తునంతా పూర్తి చేసిందనీ, మిగిలింది లాంఛనాలు మాత్రమేనని ఢిల్లీలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. విభజనపై సాంకేతిక అంశాలను పూర్తి చేయడానికి ఈనెల 29న యుపిఎ సమన్వయ కమిటీ, 30 లేదా 31న వర్కింగ్ కమిటీ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తేదీలపై ఆదివారం తుది నిర్ణయం తీసుకోవచ్చునని మీడియాలో వార్తలు వచ్చాయి.
ఆగస్టు 5 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందే స్పష్టత సాధించి, ఆ సమావేశాల్లోనే బిల్లుకు ఆమోదం పొందాలని, అక్టోబరులో రెండు రాష్ట్రాలను ఏర్పాటు చేసి, షెడ్యూలు ప్రకారం సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఎన్నికల గడువులోగా విభజన ప్రక్రియ సమగ్రంగా పూర్తి కాకపోతే, ఆర్నెల్ల పాటు ఎన్నికలను వాయిదా వేసేందుకు రాజ్యాంగపరంగా ఏదైనా అవకాశం ఉందా అన్నదానిపైనా అది న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్లో ప్రస్తుత శాసనసభ, లోకసభ గడువు ముగుస్తుంది.
కొత్తంగా ఏర్పడే రాష్ట్రానికి కూడా తెలంగాణ అని కాకుండా 'హైదరాబాద్ స్టేట్' అని పేరుపెట్టే అవకాశమున్నట్టు చెబుతున్నారు. ఈ విషయాన్ని దిగ్విజయ్ సింగ్ స్వయంగా వార్రూమ్ భేటీలో చెప్పినట్లు సమాచారం.