సిఎంపై బొత్స పాచిక: కాచుకుని ఉన్న జగన్?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు అండగా నిలిచిన తమ పార్టీ శానససభ్యులపై వేటు వేసి ఉప ఎన్నికలను ఎదుర్కోవాలనే ఎత్తుగడను పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ప్రయోగించడానికి సిద్ధపడ్డారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అవిశ్వాస తీర్మానం సందర్భంగా పార్టీ విప్ను ధిక్కరించిన జగన్ వర్గం శానససభ్యులు 9 మందిపై రెండు మూడు రోజుల్లో వేటు వేస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ చెప్పగా, మరో 15 రోజులు పడుతుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. బొత్స సత్యనారాయణ మాత్రం వారిపై వేటుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు.
వారిపై వేటు వేసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఇరికించాలనే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఉప ఎన్నికలు తీసుకుని వచ్చి ఆయనకు ఇబ్బందులు సృష్టించాలనే ఉద్దేశంతో బొత్స ఉన్నట్లు చెబుతున్నారు. సహకార ఎన్నికల ఫలితాలను కిరణ్ కుమార్ రెడ్డి తన ఖాతాలో వేసుకున్నారు. ఈ స్థితిలో ఉప ఎన్నికలు తెస్తే కిరణ్ కుమార్ రెడ్డికి అసలు పరీక్ష ఎదురవుతుందని బొత్స సత్యనారాయణ భావిస్తున్నారని అంటున్నారు.
ఉప ఎన్నికలు నిర్వహించడం ద్వారా జగన్ బలాన్ని పరీక్షించవచ్చని, ఆ ఎన్నికల్లో ఓడినా అవిశ్వాసంలో నెగ్గినందున ఇకపై ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదని ఢిల్లీ పర్యటనలో బొత్స సత్యనారాయణ అధిష్ఠానం వద్ద వాదించనున్నారు. జగన్ బలం తగ్గిందని, ఉప ఎన్నికలు పెడితే కాంగ్రెస్ సగానికిపైగా సీట్లు సాధించడం ఖాయమన్న కొత్త మెలికతో కిరణ్ను ఇరికించే వ్యూహానికి పిసిసి చీఫ్ పదును పెడుతున్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల విషయంలో అధికార పక్షం, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ వ్యూహ, ప్రతివ్యూహాలు రచిస్తుంటే కాంగ్రెస్లోని ఓ వర్గం కూడా ఉప సమరానికి సిద్ధం కావాలనే ప్రతిపాదనను తెరపైకి తీసుకొస్తున్నారు. సిఎంకు వ్యతిరేక శిబిరంగా పేరుపడ్డ వారంతా బొత్సకు మద్దతుగా మాట్లాడుతున్నారు.
కాంగ్రెస్ను వీడి పదకొండు మంది ఎమ్మెల్యేలు జగన్ పార్టీలోకి వెళ్తున్నారని అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనే తెరపైకి రాని సమయంలో, నెల ముందు పిసిసి అధ్యక్షులు బొత్స ప్రకటించారు. వాస్తవంగా బొత్స అంచనా నిజమే అయినా ఆయన మాటల ఉద్దేశం మాత్రం ఉప ఎన్నికలు రావాలన్నదేనని అంటున్నారు. బొత్స వ్యూహాన్ని నిశితంగా గమనిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా తన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు, తాము ఇంకా బలంగానే ఉన్నామన్న సంకేతం ఇచ్చేందుకు ఉప ఎన్నికలకు మానసికంగా సిద్ధమైంది. తాము కోరుకొంటున్న ఉప ఎన్నికలు పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ వల్ల నెరవేరవచ్చని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
వివిధ రాష్ట్రాల పిసిసి అధ్యక్షులతో ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ ఢిల్లీలో పార్టీ పరిస్థితిపై సమీక్షలు చేస్తున్నారు. ఈ సమావేశానికి వెళ్లనున్న బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా పాచికను పారేలా చూడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన ఓ నివేదికను కూడా తయారు చేస్తున్నారు. ఇటీవల జరిగిన సహకార ఎన్నికల్లో జగన్ పార్టీ పని అయిపోయిందని, విప్ను ధిక్కరించిన ఎమ్మెల్యేలపై వేటు వేసి ఉప ఎన్నికలకు వెళ్లడం ద్వారా సగం సీట్లు తాము గెలుచుకోవచ్చని తన నివేదికలో పొందుపర్చనున్నారు.
సగం సీట్లు తాము గెలుచుకోవడం ద్వారా 2014లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జగన్ పార్టీని పూర్తిగా తుడిచేయవచ్చని హైకమాండ్ పెద్దలకు ఆయన వివరించనున్నట్లు తెలిసింది. ఆ ఎమ్మెల్యేలపై వేటు వేయడం ద్వారా ఉప ఎన్నికలకు వెళ్లడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్సే ముప్పు ఏమీ లేదని ఆయన వాదనను తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పటికి రెండుసార్లు అవిశ్వాస తీర్మానం నెగ్గామని, ఇప్పుడు ఉప ఎన్నికలు నిర్వహిస్తే జగన్ బలాన్ని అంచనా వేయడంతో పాటు ఓడించడం ద్వారా వైయస్సార్ కాంగ్రెసును నైతికంగా దెబ్బ తీయవచ్చునని బొత్స చెప్పబోతున్నట్లు సమాచారం.
ఈ అవకాశం కోసమే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎదురు చూస్తోంది. సహకార ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంతి తమ పార్టీ బలహీనపడిందనే వాదన వినిపిస్తోంది. ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెసుతో పాటు తెలుగుదేశం పార్టీని ఓడించి మరోసారి సత్తా నిరూపించుకోవడం ద్వారా నాయకుల్లోనూ, కార్యకర్తల్లోనూ ఆత్మవిశ్వాసం పెంచాలని వైయస్ జగన్ అనుకుంటున్నట్లు, ఇదే విషయాన్ని ఆయన పార్టీ నాయకులకు చెబుతున్నట్లు తెలుస్తోంది.