జగన్ హవాకు టెస్టు: ఉప ఎన్నికలకు రెడీ?
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సుజయ కృష్ణరంగారావు, ఆళ్ల నాని ఇప్పటికే రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. ముందు వారి ముగ్గురు రాజీనామాలు ఆమోదించి, ఉప ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈలోగా ఒకవేళ అవిశ్వాసానికి సంబంధించి ఓటింగ్ జరిగితే అంతకంటే ముందే గీతదాటిన వారిపై వేటు వేయాలని భావిస్తోంది. ఆలోగా ముందు జాగ్ర త్తగా గీత దాటిన వారిపై స్పీకర్కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆళ్లనాని ముఖ్యమంత్రిని కలిసి వెనక్కి రావడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ సైతం ఇప్పటికే తమ పార్టీ నుంచి వెళ్లిన వారిపై ఫిర్యాదు చేసినందున, మొత్తం కలిపి నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదంటున్నారు. రాజీనామాలపై రెండు మూడు రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుంటామని పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, గీత దాటిన వారిపై వేటు తప్పదని చీఫ్ విప్ గంట్ర వెంకటరమణారెడ్డి తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. గీత దాటిన వారిని 2014 ఎన్నికల వరకూ మాజీలుగా మార్చే వ్యూహానికీ కాంగ్రెస్ పదునుపెడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఉన్న చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది.
అసెంబ్లీ సమావేశాల తర్వాత గీత దాటిన వారిపై వేటు వేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పిటిషన్లు, వాదనలు ఇవన్నీ ముగిసి దానిపై నిర్ణయం తీసుకునేందుకు ఎలాగూ ఒక మూడు నెలల సమయం పడుతుంది. అప్పటికి జూన్ లేదా జులై కావచ్చు. అప్పటికి సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడెనిమిది నెలల గడువు మాత్రమే ఉంటుంది. రాజీనామా ఆమోదించిన తర్వాత గానీ, లేదా స్పీకర్ నిర్ణయం ప్రకటించిన తర్వాత ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించవలసి ఉంటుంది.
అయితే, అప్పటికి సార్వత్రిక ఎన్నిలకు మరో ఏడెనిమిది నెలల గడువు మాత్రమే ఉన్నందున, ప్రజాధనం వృధా అవుతుంది కాబట్టి అప్పటివరకూ ఎన్నికలు నిర్వహించవలసిన అవసరం లేదనే చట్టాన్ని ప్రభుత్వం వినియోగించుకునే వీలుంది. ప్రస్తుతం పార్టీ నాయకత్వం దీనిపైనే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ఆరునెలల ముందు ఎన్నికలు నిర్వహించకూడదన్న నిబంధన ఉందని, దానినే జగన్ గూటికి వెళ్లిన వారిపై ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది.