హైదరాబాద్ చుట్టూ తెలం'గానం': ప్రత్యేక హోదా
ఈ నెల 7వ తేదిన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ విదేశాల నుండి తిరిగి వచ్చాక తెలంగాణపై చర్చ జోరుగా సాగుతోంది. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయిస్తే సీమాంధ్రలో ఆగ్రహం వ్యక్తమవుతుందని, ప్రజాప్రతినిధులు మూకుమ్మడి రాజీనామాలకు పూనుకునే అవకాశాలున్నాయని విభజనకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదం పొందడం కష్టమని కేంద్రం అభిప్రాయపడుతోంది.
సీమాంధ్ర నేతలు కూడా విజ్ఞప్తి పేరిట ఈ హెచ్చరికలు చేశారు. అదే విధంగా తెలంగాణ ఇచ్చే అవకాశాలు లేవని స్పష్టం చేస్తే తెలంగాణలో ఉద్యమం ఊపందుకుని శాంతి భద్రతల సమస్య, ప్రజాప్రతినిధుల రాజీనామాలు జరగవచ్చునని కూడా కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉభయ ప్రాంతాల ప్రజాప్రతినిధులను ఒప్పించేందుకు తెర వెనుక మంతనాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
కేంద్రం హైదరాబాద్ను తాత్కాలికంగా కేంద్ర పాలిత ప్రాంతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. చర్చల పర్వం ఇంకా పూర్తి కాలేదని, బహుశా చింతన్ భైఠక్లో ఇది కొలిక్కి రావొచ్చంటున్నాయి. రిపబ్లిక్ డే తర్వాతే కేంద్రం తన నిర్ణయం ప్రకటిస్తుందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్ అత్యంత కీలకమైనందున రాష్ట్ర విభజన జరిగితే హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన అధిష్ఠానం పెద్దల్లో ఉందంటున్నారు.
హైదరాబాద్లో నివసించే సీమాంధ్ర ప్రాంతవాసుల సంగతేమిటంటూ ఈ ప్రాంత నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో అధిష్ఠానం ఆలోచనలో పడిందట. ఇలాంటి తరుణంలో రాష్ట్ర విభజన అంశంపై కేంద్రం మదిలో ఏముందో ఎవరికీ అంతుబట్టడం లేదు. దీంతో బొత్స ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గురువారం సాయంత్రం దాదాపు 8 మంది అగ్రనేతలు ఢిల్లీలోని గురుద్వారా రికాబ్ గంజ్లోని వార్ రూమ్లో తెలంగాణ సమస్యపై మేధోమథనం సాగించారు.
హైదరాబాదుకు ప్రత్యేక హోదా?
ప్రస్తుతం కర్నాటకలో అంతర్భాగమైన నాటి నిజాం పాలనలోని బీదర్, బళ్లారి, రాయచూరు, కొప్పళ, గుల్బర్గా, యాద్గిర్ ఈ ఆరు జిల్లాలతో కూడిన హైదరాబాద్ కర్ణాటకకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే బిల్లుకు పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోదం లభించింది! అనేక సంవత్సరాలుగా సమస్యగానే ఉన్న తెలంగాణకు హైదరాబాద్ - కర్ణాటక పరిష్కారాన్ని పరిశీలించే అవకాశాలపై ఇప్పటికే చర్చ జరుగుతోంది.
అయితే, తెలంగాణ ప్రాంతంలో మాదిరిగా ఉత్తర కర్ణాటకలో ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమమేదీ జరగడం లేదు. ఉత్తర కర్ణాటకకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడం ఆంధ్ర ప్రదేశ్పై ఎలాంటి ప్రభావం చూపించేది కాదు. కానీ, తెలంగాణపై చర్చ జరుగుతుండగా ఈ నిర్ణయం తీసుకోవడంతో దీనికి ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే అంతకుముందు పశ్చిమ బెంగాల్లో గూర్ఖాలాండ్ కౌన్సిల్ను ఏర్పాటు చేసినట్టుగా తెలంగాణకు కూడా ఓ మండలి ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా కేంద్రం పరిశీలనలో ఉంది.
ఒకవేళ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే విదర్భ, బోడోలాండ్, కర్ణాటక - హైదరాబాద్ ప్రాంతం నుంచి కూడా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ వినిపించే ప్రమాదం ఉందని కేంద్రం ఆలోచిస్తోందట. ప్రస్తుతం ఒక బోర్డును ఏ ర్పాటు చేసి రెండో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిటీని కూడా నియమిస్తే తెలంగాణ ప్రాంత ప్రజలు కొద్దిగా శాంతించవచ్చని కేంద్రం భావిస్తోంది. హైదరాబాద్ - కర్ణాటక ప్రత్యేక హోదా పంథాలో అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేసి ఉద్యోగాలు, చదువుల్లో రిజర్వేషన్లు కల్పించే పక్షంలో ప్రత్యేక రాష్ట్రం అవసరం ఉండదనీ చెబుతున్నారు.