బైపోల్స్: జగన్ ఉత్సాహంపై నీళ్లు, కిరణ్కు ఊరట
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై శానససభలో అవిశ్వాస తీర్మానం విషయంలో పార్టీల విప్ ధిక్కరించిన 18 మంది శాసనసభ్యులకు శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నోటీసులు జారీ చేశారు. వీరిలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు చెందిన శాసనసభ్యులు తొమ్మిదేసి మంది ఉన్నారు. మార్చి 30వ తేదీన తాను జారీ చేసిన నోటీసులకు శాసనసభ్యులు వివరణ ఇచ్చిన తర్వాత వారిని ఒక్కరినొక్కరిని పిలిచి స్పీకర్ మాట్లాడుతారు.
ఆ తర్వాత శాసనసభ్యులపై స్పీకర్ అనర్హత వేటు వేసిన తర్వాత ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు 18 స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యంగా మారుతాయి. శానససభ రద్దుకు ఏడాది కూడా కన్నా తక్కువ గడువు ఉండడంతో రాష్ట్రంలో ఉప ఎన్నికలు నిర్వహించకూడదని ఎన్నికల కమిషన్ భావిస్తున్నట్లు సమాచారం. సాధారణ ఎన్నికలకు ఏడాది కన్నా తక్కువ గడువు ఉన్న స్థితిలో ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదని సెక్షన్ 151(ఎ) చెబుతోంది.
కాగా, స్పీకర్ జారీ చేసిన నోటీసులు తమకు అందలేదని శాసనసభ్యులు చెబుతున్నారు. వారు నోటీసులు అందుకుని, స్పీకర్ ప్రక్రియ పూర్తి చేయడానికి ఇంకా చాలా సమయమే పడుతుంది. అందువల్ల శానససభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశాలు లేవని అంటున్నారు.
కాంగ్రెసుకు చెందిన గొట్టిపాటి రవికుమార్, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, బి. శివప్రసాద్ రెడ్డి, ఆళ్ల నాని, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, సుజయ కృష్ణ రంగారావు, సిహెచ్ రాజేష్, పేర్ని నాని, జోగి రమేష్లకు, తెలుగుదేశం పార్టీకి చెందిన అమర్నాథ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, వై బాలనాగిరెడ్డి, కొడాలి వెంకటేశ్వర రావు (నాని), చిన్నం రామకోటయ్య, తానేటి వనిత, పి. సిరాజ్, కె. హరీశ్వర్ రెడ్డి, ఎస్ వేణుగోపాలాచారిలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు.