కాంగ్రెసు ఫట్: జగన్, కెసిఆర్లదే హవా
ఈ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే - రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోతుందని స్పష్టమైంది. వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు, కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి కలిసి 50 శాతానికి పైగా సీట్లు సంపాదించి అధికారాన్ని సొంతం చేసుకుంటాయని స్పష్టమైనంది. 2009లో కాంగ్రెస్కు పడిన ఓట్లలో అధిక భాగం ఇప్పుడు ఈ రెండు పార్టీలకు మళ్లే అవకాశం కూడా ఉందని సర్వే తెలిపింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్రం నుంచి లోక్సభలో అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని తెలిపింది.
2009 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 33 లోక్సభ స్థానాలు గెలుచుకోగా, వచ్చే ఎన్నికల్లో ఎనిమిదికి మించి సీట్లు గెలుచుకునే అవకాశాలు లేవని సర్వేలో తేలింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్కు 52.5 శాతం ఓట్లు వచ్చాయి. అయితే, వచ్చే ఎన్నికల్లో 18 శాతం కంటే తక్కువకు పడిపోయే సూచనలున్నాయని వెల్లడించింది. ఈ ఓట్లలో ఎక్కువ భాగం వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలకు వెళ్లే అవకాశాలున్నట్లు సర్వే తేల్చింది.
రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో వైయ్ససార్ కాంగ్రెసు పార్టీకి, తెలంగాణ ప్రాంతంలో తెరాసకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా సర్వేలో తేలింది. 'ఉత్తమ ముఖ్యమంత్రి' విషయంలో 18 రాష్ట్రాల సీఎంల మధ్య సర్వే జరపగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఎనిమిదవ స్థానంలో నిలిచారు. కిరణ్ నాయకత్వం లో రాష్ట్రంలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకునే సూచనలే లేవని సర్వే స్పష్టం చేసింది. ముఖ్యంగా, సర్వేలో పాల్గొన్న వారిలో 64 శాతం మంది జగన్పై కేసులను వేధింపు చర్యలో భాగమేనని చెప్పారు.
ఇండియా టుడే-నీల్సన్ తాజా వార్షిక సర్వే ప్రకారం, దేశ ప్రజల్లో అధిక శాతం మందికి కాంగ్రెస్ సారథ్యంలోని యుపిఎ పట్ల విముఖత పెరుగుతున్న సూచనలున్నాయి. బీజేపీ సారథ్యంలోని ఎన్డియే పరిస్థితి మాత్రం యుపిఎ కంటే కొద్దిగా మెరుగ్గా ఉంది. 2009లో 259 స్థానాలు సంపాదించుకున్న యుపిఎ 2014 ఎన్నికల్లో 152 నుంచి 162 స్థానాల దగ్గరే ఆగిపోవచ్చని సర్వే తెలిపింది.
2009 ఎన్నికల్లో 159 స్థానాలు చేజిక్కించుకున్న ఎన్డీయె ఈసారి 198 నుంచి 208 స్థానాల వరకూ గెలుచుకునే సూచనలున్నాయి. ఇతర పార్టీలకు 178 నుంచి 188 స్థానాలు లభించవచ్చని సర్వేలో వెల్లడైంది. ప్రధానిగా రాహుల్ గాంధీ కన్నా గుజరాత్ సీఎం మోడీకే ఆదరణ ఎక్కువగా ఉన్నట్టు సర్వేలో తేలింది. దేశ ప్రధానిగా మోడీ సమర్థుడైన నాయకుడని అత్యధిక సంఖ్యాకులు అభిప్రాయపడుతున్నారు. రాహుల్ గాంధీని 41 శాతం మంది ప్రధానిగా కోరుకుంటే, నరేంద్ర మోడీ ప్రధాని కావాలని 57 శాతం మంది కోరుకుంటున్నారు.