ఖేల్ ఖతమ్: వీరంతా అయిపోయినట్లే (పిక్చర్స్)
హైదరాబాద్: ప్రస్తుతం యువకులతో కూడిన జట్టును చూస్తుంటే తిరిగి జట్టులోకి వస్తామనే ఆశలను ఇటీవలి సీనియర్లు వదులుకోక తప్పేట్లు లేదు. ఒకప్పుడు అదురుకొడుతారని భావించిన క్రికెటర్లు అంతర్జాతీయ మ్యాచుల్లో ఆడే పరిస్థితి లేకుండా పోయింది. చాంపియన్స్ ట్రోఫీలో యువకులతో కూడిన భారత జట్టు చూపిన తెగువ, ధైర్యం, నిలకడ వారిని ఇక శాశ్వతంగా అంతర్జాతీయ మ్యాచులకు దూరం చేసేట్లు కనిపిస్తోంది.
వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ వంటి క్రీడాకారులకు జట్టులో స్థానం లభించడం దుర్లభమయ్యే పరిస్థితి ఏర్పడింది. జట్టును అత్యంత పకడ్బందీగా కూర్చడంలో సెలెక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్ చూపిన సాహసం ఫలితం ఇస్తుందని అర్థమవుతోంది. సచిన్ టెండూల్కర్ వంటి ఆటగాఢు కూడా సందీప్ పాటిల్ వ్యవహారశైలికి తలవంచక తప్పలేదు. వరుసగా విఫలమవుతూ కూడా జట్టులో కొనసాగుతున్న సచిన్ టెండూల్కర్ను కదిలించిన ఘనత సందీప్ పాటిల్దే.
ఇలాగే బ్యాటింగ్ చేస్తానంటే వైదొలగాల్సిందేనని, పాత సచిన్లా ఆడుతానంటేనే కొనసాగాలని సందీప్ పాటిల్ కరాఖండిగా చెప్పాడు. దీంతో పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి టెండూల్కర్ తప్పుకున్నాడు. గౌతం గంభీర్ ఫరవాలేదనిపించినా నిలకడగా ఆడలేకపోయాడు. ఈ స్థితిలో అతనిపై కూడా వేటు పడింది. ఫామ్లో లేని ఆటగాళ్లను పక్కన పెట్టి యువకులకు అవకాశం కల్పించడంలో ప్రముఖ పాత్ర వహించింది సందీప్ పాటిలే.
ప్రపంచ కప్ను సాధించిన జట్టులో ఆడిన కెప్టెన్ ధోనీ, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా మాత్రమే ప్రస్తుతం జట్టులో ఉన్నారు. మిగతావారంతా కొత్తవారే. ఇప్పుడు విజయాలు సాధించడానికి అనువుగానే కాకుండా వచ్చే ప్రపంచ కప్ను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే జట్టును కూర్చినట్లుగా ఉంది. టెస్టు క్రికెట్కు వచ్చే సరికి కాస్తా మార్పులు చేర్పులు ఉండవచ్చు. కానీ, ఈ తాజా మాజీలు వస్తారని అనుకోవడానికి వీలు లేకుండా పోయింది.
ఫామ్లో లేనప్పుడు ఎవరైనా తప్పుకోవాల్సిందేననే సంకేతాలను సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ వ్యవహారం తేల్చేసింది. టెండూల్కర్ తనంత తానుగా పరిమిత ఓవర్ల నుంచి తప్పుకునేలా సెలెక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్ వ్యవహరించాడు.
వన్డేల్లోకి వీరేంద్ర సెహ్వాగ్ తిరిగి అడుగు పెట్టడం కలగానే మిగిలిపోయింది. అతనికి ప్రత్యామ్నాయంగా శిఖర్ ధావన్ ముందుకు వచ్చాడు. దూకుడుతో పాటు నిలకడ ప్రదర్శిస్తున్న శిఖర్ ధావన్ను తప్పించి మళ్లీ సెహ్వాగ్ వైపు దృష్టి సారించే అవకాశం ఉండదు.
నిజానికి, గౌతం గంభీర్ స్థానం భర్తీ చేయాల్సింది మురళీ విజయ్. ఈ విషయంలో మురళీ విజయ్కు అవకాశాలు బాగానే వచ్చాయి. కానీ, చాంపియన్స్ ట్రోఫీలో కెప్టెన్ ధోనీ రోహిత్ శర్మతో ప్రయోగం చేసి విజయం సాధించాడు. రోహిత్ శర్మ ఫామ్లో ఉన్నంత కాలం శిఖర్ ధావన్తో కలిసి ఆడుతాడు. లేదంటే మురళీ విజయ్ ఉండనే ఉన్నాడు. కాబట్టి గంభీర్కు ఇక స్థానం దక్కకపోవచ్చు.
యువరాజ్ సింగ్కు ప్రత్యామ్నాయంగా రవీంద్ర జడేజా జట్టులోకి వచ్చాడు. జడేజా ఆశించినట్లే తగిన విధంగా రాణిస్తున్నాడు. ఆల్ రౌండర్గా తన పాత్రను అత్యంత ప్రతిభావంతంగా చాంపియన్స్ ట్రోఫీలో నిర్వహించాడు. దాంతో యువరాజ్ సింగ్ మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశాలు లేవు
స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఇక ఆశలు వదులుకోవాల్సిందే. జట్టు ప్రధాన స్పిన్నర్గా అశ్విన్ ముందుకు వచ్చాడు. జడేజా ప్రధాన స్పిన్నర్ కాకపోయినప్పటికీ అంచనాలకు మించి రాణిస్తున్నాడు. దీంతో మళ్లీ భజ్జీ జట్టులోకి వచ్చే అవకాశాలు లేవు.
ఫాస్ట్ బౌలింగులో కీలక పాత్ర పోషించిన జహీర్ ఖాన్ ఇక ఆశలు వదులుకోక తప్పదు. యువకులు ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్నారు. ఇషాంత్ శర్మ కూడా తగిన విధంగా రాణిస్తున్నాడు.