కెసిఆర్కు టోకరా: జగన్ వైపు టీ - ఎమ్మెల్యేలు
తెరాసలో చేరడానికి ఇష్టం లేని శానససభ్యులు వైయస్ జగన్ వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యులు మొత్తం 17 మంది కూడా సీమాంధ్రకు చెందినవారే. ఇటీవల కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసిన ఐదుగురు సీమాంధ్ర శాసనసభ్యులు కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నారు. వీరికితోడు, సీమాంధ్రకు చెందిన మరో పది మంది శాసనసభ్యులు కూడా వైయస్ జగన్ వైపు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.
తెలంగాణకు సంబంధించినంత వరకు నల్లగొండ, మహబూబ్నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి నాయకులు ఉన్నారు. ఈ నాలుగు జిల్లాల నుంచి శాసనసభ్యులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ శానససభ్యులు ఇద్దరు ముగ్గురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరబోతున్నట్లు వినికిడి.
అయితే, ఇప్పటికిప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి తెలంగాణ శానససభ్యులు ఇష్టపడడం లేదని అంటున్నారు. తెలంగాణకు పార్టీ వైఖరి అనుకూలంగా లేకపోవడంతో ఇప్పుడు చేరడడం వల్ల సమస్యలు వస్తాయని వారు భావిస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణపై కేంద్రం నిర్ణయం ప్రకటించిన తర్వాత చేరేందుకు వారు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణపై కేంద్రం నిర్ణయం ఎలా ఉన్నా, అప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి పెద్గగా ఆటంకాలు ఉండవని భావిస్తున్నారు
ఈ నెల 6వ తేదీ నుంచి వైయస్ జగన్ సోదరి షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేయనున్నారు. పాదయాత్ర సందర్బంగా తెలంగాణకు చెందిన పలువురు శాసనసభ్యులను తమవైపు లాక్కోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు.