అంతా గప్చుప్: టిఆర్ఎస్లోకి 3గురు ఎంపీలు!
మహబూబ్నగర్లో కెసిఆర్ పర్యటించిన వచ్చిన రోజునే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావుతో కలిసి మంద జగన్నాథం టీఆర్ఎస్ చీఫ్ నివాసానికి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల్లో మంద జగన్నాథం, జి.వివేక్, సిరిసిల్ల రాజయ్య తెరాసలోకి వెళతారని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. నాగర్ కర్నూలు, పెద్దపల్లి, వరంగల్ లోక్సభ నియోజకవర్గాల తెరాస అభ్యర్థులు వారే అని పార్టీలో అంతర్గతంగా ప్రచారం జరుగుతోంది.
వివిధ కారణాలవల్ల వారి చేరిక మాత్రం ఆలస్యమవుతోందంటున్నారు. దీంతో పార్టీలోకి రావడంపై త్వరగా తేల్చుకోవాలని ఆ ముగ్గురు ఎంపీలకు తెరాస అధినాయకత్వం సూచించిందట కూడా. శుక్రవారం జరిగిన తెరాస పొలిట్బ్యూరో సమావేశంలో చేరికల అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని, వారం రోజుల్లోనే ఫలితాలు చూస్తారని కెసిఆర్ అన్నట్లుగా తెలుస్తోంది.
వీటన్నింటి నేపథ్యంలోనే మంద జగన్నాథం కెసిఆర్ను కలవడం గమనార్హం. తెరాసలో చేరడానికి మరికొంత సమయం కావాలని జగన్నాథం కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు అలంపూర్ అసెంబ్లీ టికెట్ తన కుమారుడికి ఇవ్వాలని కూడా ఆయన అడిగినట్లు చెబుతున్నారు. మంద జగన్నాథం తెరాస తీర్థం పుచ్చుకోవడం లాంఛనమేనని అంటున్నారు.