జగన్ కేసు: దర్యాప్తు అధికారికి పొడగింపు?
కేరళ క్యాడర్ ఐపియస్ అధికారి వెంకటేష్ సిబిఐ హైదరాబాద్ రేంజ్కు డిప్యుటేషన్పై 2009లో వచ్చారు. ఆయన డిప్యుటేషన్ కాల పరిమితి ఆగస్టు 16వ తేదీతో ముగుస్తుంది. జగన్ ఆస్తుల కేసు దర్యాప్తును పూర్తి చేసి సెప్టెంబర్ 8వ తేదీలోగా చార్జీషీట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు సిబిఐని ఆదేశించింది. ఈ స్థితిలో వెంకటేష్ డిప్యుటేషన్ను పొడగించవచ్చునని అంటున్నారు.
జగన్ ఆస్తుల కేసులో మిగతా ఆంశాలపై చార్జిషీట్లు దాఖలు చేయడానికి వెంకటేష్ రాత్రింబవళ్లు పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. జగన్ ఆస్తుల కేసులో సిబిఐ ఇప్పటి వరకు ఐదు చార్జిషీట్లను దాఖలు చేసింది. ఇండియా సిమెంట్స్, పెన్నా సిమెంట్స్, కోల్కతా సూట్కేసు కంపెనీల వంటి ఏడు అంశాలపై సిబిఐ చార్జిషీట్లు దాఖలు చేయాల్సి ఉంది.
సత్యం కంప్యూటర్స్ కుంభకోణం దర్యాప్తు సాగుతున్నప్పుడు వెంకటేష్ డిప్యూటేషన్పై హైదరాబాద్ వచ్చారు. ఆ కేసులో ఆయన అనుబంధ చార్జిషీట్ను దాఖలు చేశారు. ఈ కేసులో విచారణ పూర్తి కావస్తోంది. ఎమ్మార్ కుంభకోణం కేసు, ఓఎంసి కేసు వంటి దర్యాప్తుల్లో కూడా ఆయన సిబిఐ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మినారాయణకు ఆయన సహకరిస్తూ వచ్చారు.
లక్ష్మినారాయణ ఇటీవల తన మాతృసంస్థకు తిరిగి వెళ్లారు. ప్రస్తుతం హైదరాబాద్ రేంజ్కు ఇంచార్జీ జాయింట్ డైరెక్టర్ మాత్రమే పర్యవేక్షకుడిగా ఉన్నారు. దీంతో వెంకటేష్ డిప్యూటేషన్ గడువును పొడిగించవచ్చునని అంటున్నారు.