జగన్ పార్టీ నిర్ణయం: కాంగ్రెస్లో కొత్త ఊపు
ఇది పరోక్షంగా కాంగ్రెసు పార్టీకి లాభిస్తుంది. డిసిసిబి ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని టిడిపి, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు మొదటి నుండి భావించాయి. ఇందుకోసం జిల్లాల వారిగా క్యాంపు రాజకీయాలు కూడా చేపట్టాయి. అయితే, జగన్ పార్టీ నిర్ణయం కాంగ్రెసుకు బలాన్నిచ్చిందని అంటున్నారు. కాంగ్రెసుకు మద్దతిస్తున్నట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రకటన ఏమీ చేయలేదు. అయితే, మూడు జిల్లాలకే పరిమితం కావాలన్న ఆ పార్టీ నిర్ణయం మాత్రం కాంగ్రెసుకు లాభిస్తుంది.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా చిత్తూరులో భూమన కరుణాకర్ రెడ్డి, సిఎం ప్రత్యర్థి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిలు బలంగా ఉన్నారు. దీంతో అక్కడ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బరిలోకి సిద్ధపడింది. జగన్ సొంత జిల్లా కడపలో ఎలాగూ ప్రభావం ఉంటుంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ క్యాడర్ బరిలోకి దిగేందుకు ఉత్సాహం చూపించింది. దీంతో ఆ మూడు జిల్లాల్లో పోటీకి సై అన్నారు.
కృష్ణా జిల్లాలో తొలుత కాంగ్రెసు పరిస్థితి ఆందోళకరంగా కనిపించినప్పటికీ ఆ తర్వాత పరిస్థితి మారింది. కాంగ్రెసు గెలుపుపై పూర్తి నమ్మకంతో ఉంది. దీంతో కృష్ణా జిల్లాతో పాటు గుంటూరు, విశాఖపట్నం, అనంతపురం జిల్లాల్లో కాంగ్రెసు బలం ఒక్కసారిగా పెంచినట్లయిందని చెబుతున్నారు. జగన్ పార్టీ నిర్ణయంతో మిగిలిన జిల్లాల్లో కాంగ్రెసు పార్టీ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కాంగ్రెసు శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. పోటీకి విముఖత ద్వారా జగన్ పార్టీ పరోక్షంగా కాంగ్రెసు పార్టీకి కొత్త శక్తినిచ్చినట్లయిందని అంటున్నారు.