బాద్ షా: బాలయ్య ఫ్యాన్స్ దూరం, జగన్ పార్టీ లీడ్
విజయవాడ: కృష్ణా జిల్లా రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారం తీవ్ర పరిణామాలకు దారి తీసే సూచనలు కనిపిస్తున్నాయి. తెలుగు సినీరంగంపై కూడా అది ప్రభావం చూపేట్లు అనిపిస్తోంది. కృష్ణా జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ బాద్ షా విడుదల వేడుకను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు ముందుండి నిర్వహించారు. బాద్ షా సినిమా శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే.
బాద్ షా విడుదల వేడుకలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తల మద్దతు లభించింది. బాద్ షాపై సానుకూల సమీక్షలు రావడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెగ సంతోషిస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ అభిమానులు బాద్ షా సినిమాను సొంతం చేసుకోవడం లేదని, దాన్ని ప్రోత్సహించడం లేదని అంటున్నారు. బాద్ షాకు భారీ మొత్తానికి పంపిణీదారులు చెల్లించినట్లు వార్తలు వచ్చాయి. కృష్ణా జిల్లాలో 2.5 కోట్ల రూపాయలకు, గుంటూరు జిల్లాలో 3.75 కోట్ల రూపాయలకు హక్కులను కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి.
బాద్ షా సినిమా విడుదలకు ముందు బాలకృష్ణ, ఎన్టీఆర్ అభిమానులు కలిసే ఉండేవారు. దాంతో ఎన్టీ రామారావు వారసులుగా వారిద్దరి సినిమాలకు ఎక్కడ లేని ప్రోత్సాహం లభించేది. జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేసినప్పటికీ క్రమంగా ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి దూరమయ్యారు.
విజయవాడ పర్యటన సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్కు దూరంగా ఉండాలని బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ నాయకులకు సూచించినట్లు తెలుస్తోంది. దాంతో జూనియర్ ఎన్టీఆర్ బాద్ షా సినిమాకు కష్టాలు తప్పవని అనుకున్నారు. కానీ, అటువంటి చిక్కులేమీ కలగకపోవడంతో పంపిణీదారులు, ఎగ్జిబిటర్స్ ఊపిరి పీల్చుకున్నారు.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాద్ షా విడుదల వేడుకలకు దూరంగా ఉండడంతో వైయస్ జగన్ పార్టీ నాయకులు దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకున్నారు. అయితే, బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ పట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ మెతక వైఖరి అవలంబించకూడదని భావిస్తున్నట్లు సమాచారం.